యశవంతపుర : వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. వివరాలు.. పోలీసుల కథనం మేరకు బెంగళూరు రామచంద్రపురానికి చెందిన నాగరాజుకు మండ్యకు చెందిన వనజాక్షి(25)తో 8 నెలల క్రితం వివాహమైంది. అయితే తన పుట్టింటిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, డబ్బు పంపాలని భర్తపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ఆరు నెలలుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో వనజాక్షి ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది.
మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని పోలసులకు ఫిర్యాదు చేశారు. విద్యారణ్యపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి పరారీలో ఉన్న భర్త నాగరాజు కోసం గాలిస్తున్నారు.