బిడ్డ అస్తికలతో సముద్రంలో మునిగిన తల్లి  

16 Aug, 2021 08:11 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రమాదంలో మరణించిన తనయుడి అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు వెళ్లిన ఓ తల్లి  మృతదేహంగా ఒడ్డుకు చేరింది. కోవళం బీచ్‌లో ఈ విషాద ఘటన ఆదివారం వెలుగు చూసింది. తాంబరం సమీపంలోని పెరుంగళత్తూరు గుండు మేడుకు చెందిన వసంతి (42). ఆమె కుమారుడు గోకులన్‌ (21) స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. గత నెల 22వ తేదీ మోటారు సైకిల్‌ ప్రమాదంలో గోకులన్‌ మరణించాడు. ఒక్కగానొక కుమారుడు దూరం కావడంతో వసంతి ఒంటరి అయ్యారు. అతడి అస్తికల్ని ఇంట్లో ఫొటో వద్ద ఉంచి ప్రతి రోజూ పూజ చేస్తూ వచ్చారు. తీవ్ర శోకంతో ఆమె ఉండటమే కాకుండా, అస్తికల్ని ఇంట్లోనే ఉంచుకోవడాన్ని బంధువులు ఖండించారు. అస్తికల్ని సముద్రంలో కలిపేయాలని సూచించారు. దీంతో  ఆమె శనివారం అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు కోవళం బీచ్‌కు  వెళ్లారు. తిరిగి ఇంటికి చేరకపోవడంతో జాడ కోసం  బంధువులు గాలించారు. పోలీసులకు సమాచారం అందించారు.

ఆమె ఫోన్‌ రింగ్‌ అవుతున్నా, ఎవ్వరూ తీయ లేదు. ఎట్టకేలకు ఓ వ్యక్తి ఆ ఫోన్‌ను అందుకుని బీచ్‌లో పడి ఉన్నట్లుగా సమాచారం ఇచ్చాడు. కోవళం బీచ్‌కు వెళ్లి అక్కడి జాలర్ల వద్ద విచారించగా, ఓ మహిళ గంటల తరబడి సముద్రం ఒడ్డున అస్తికలతో ఓ చోట కూర్చుని తీవ్రంగా ఏడుస్తున్నట్లుగా పేర్కొన్నారు.   కదిలించినా ఆమె మాట్లాడక పోవడంతో పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఆమె మృతదేహం ఒడ్డుకు చేరింది. తీవ్ర మనో వేదనతో ఉన్న వసంతి అస్తికల్ని సముద్రంలో కలిపి తర్వాత బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు