పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కిటికీలోంచి విసిరేసి..

7 Aug, 2021 07:05 IST|Sakshi

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన అవివాహిత ప్రైవేట్‌ క్లినిక్‌లో బిడ్డకు జన్మనిచ్చి పురిటిబిడ్డను శౌచాలయం కిటికీలోంచి విసిరేసిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. హెసరఘట్టకు చెందిన మహిళ (22) అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ప్రైవేటు ఆస్పత్రికి వచ్చి దాఖలయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె పురిటిబిడ్డను శౌచాలయంలోని కిటికీలోంచి విసిరేసి పరారైంది.

ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హాస్పిటల్‌ సిబ్బంది మాదనాయకనహళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేసి అనంతరం చికిత్స కోసం లక్ష్మివిలాస్‌ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన గుడేమారనహళ్లికి చెందిన శశాంక్‌ (25) అనే వ్యక్తిని అరెస్టు చేసారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు