కొబ్బరికాయ కొడదామని గుడికి.. అంతలోనే బాబుతో

18 Apr, 2021 08:29 IST|Sakshi
సంగీత (ఫైల్‌ ఫోటో)

నారాయణఖేడ్‌: రెండున్నర నెలల బాబుతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నారాయణఖేడ్‌లో చోటు చేసుకుందని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని డీఎన్‌టీ తండాకు చెందిన కర్ర ప్రకాశ్‌ (34)కు సిర్గాపూర్‌ మండలం జమ్లా తండాకు చెందిన సంగీత (26)తో తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లతోపాటు ఇంకా పేరు కూడా పెట్టని రెండున్నర నెలల బాబు సంతానం ఉన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కర్ర ప్రకాష్‌ భార్యా పిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. రెండు నెలల క్రితం సంగీత తల్లిగారి గ్రామమైన జెమ్లాతండాకు వెళ్లింది. అత్తగారి గ్రామమైన డీఎన్‌టీ తండాలో పూజ ఉన్నందున ఈనెల 1వ తేదీన ఇక్కడకు వచ్చింది.

పూజ ముగిశాక వారం రోజులుగా ఖేడ్‌ పట్టణంలోని ప్రకాశ్‌ అక్క నిర్మల ఇంటికి వచ్చి ఉంటోంది. ఈ నెల 15న ఉదయం డీఎన్‌టీ తండాలోని ఒక గుడి వద్ద కొబ్బరికాయ కొడదామంటూ తన బాబును తీసుకొని సమీప బందువైన క్రిశాంక్‌తో కలిసి బైక్‌పై వెళ్లింది. కొబ్బరికాయ తీసుకురమ్మంటూ క్రిశాంక్‌ను పంపించి ఆ తర్వాత తనబాబుతో కలిసి సంగీత అదృశ్యమైంది. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త కర్ర ప్రకాశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 
చదవండి: ప్రేయసికి నిశ్చితార్థం: అంతలోనే కిడ్నాప్‌ చేసిన లవర్‌

మరిన్ని వార్తలు