వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. తట్టుకోలేక రాత్రి..

1 Dec, 2021 09:16 IST|Sakshi
వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకట్‌రెడ్డి

సాక్షి, కరీంనగర్‌: వివాహేతర సంబంధం పెట్టుకుందని నిత్యం ప్రచారం చేయడంతో ఆ కోడలు విసుగు చెందింది.. తన మామను అక్క కుమారుడితో కలిసి అంతమొందించింది.. గత నెల 27న కాచాపూర్‌లో మాతంగి కనకయ్య(70) హత్యకు గురవగా.. చంపింది కోడలేనని హుజూరాబాద్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కనకయ్య భార్య, కుమారుడు గతంలోనే మృతిచెందారు.

ఈ క్రమంలో ఆయన నిత్యం మద్యం సేవించి, కోడలు కొంరమ్మకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తున్నాడు. తిండిపెట్టడం లేదని తిడుతున్నాడు. ఈ నెల 27న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముసలోడు బతికుంటే ఎప్పుడూ తనను అనుమానిస్తాడని, ఆస్తి కూడా దక్కదని ఆమె భావించింది. తన అక్క కుమారుడు, మానకొండూర్‌ మండలం కల్లెడకు చెందిన ప్రవీణ్‌తో కలిసి కనకయ్యను చంపేందుకు ప్లాన్‌ వేసింది.

అదేరాత్రి గదిలో నిద్రిస్తున్న కనకయ్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి, గొంతుకు తాడు బిగించి, బలంగా లాగడంతో మృతిచెందాడు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కొంరమ్మ, ప్రవీణ్‌లపై హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ కిరణ్, ఎస్సై ప్రశాంత్‌రావులు కేసు నమోదు చేశారు. నిందితులను విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీంతో వారిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. హత్య కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను ఏసీపీ అభినందించారు. 

చదవండి: ప్రేమించి, శారీరకంగా ఒక్కటై.. గర్భం దాల్చగానే..

మరిన్ని వార్తలు