భార్యను చంపి అడవిలో పూడ్చిపెట్టాడు..

18 Apr, 2021 16:42 IST|Sakshi

నిందితుడి అరెస్ట్‌ 

గుణుపూర్‌ సమితిలో ఘటన 

సాక్షి, రాయగడ: జిల్లా పరిధిలోని గుణుపూర్‌ సమితి, చినసరి గ్రామంలో గౌరి బౌరి(32) అనే వివాహిత మృతదేహాన్ని పోలీసులు శనివారం గుర్తించారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన ఈమె ఇప్పుడు శవమై కనిపించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమెని భర్తే చంపేసి మట్టిలో పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలిలా ఉన్నాయి.. చినసారి గ్రామానికి చెందిన గౌరి బౌరి(32)ని అదే గ్రామానికి చెందిన సురేందర్‌ సొబొరొ(38) పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.

సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఏదో కారణమై కొన్నాళ్ల క్రితం తగాదాలు మొదలయ్యాయి. ఇలా తరచూ వీరిద్దరూ గొడవ పడుతుండగా ఈనెల 5వ తేదీన ఎప్పటిలాగే సురేందర్‌ సొబొరొ తన భార్యతో గొడవపడి ఆమెని అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని గ్రామ సమీపంలోని అడవిలో పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియని వాడిలా తన భార్య కనబడుట లేదని తన అత్తవారికి తెలిపాడు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన గౌరి తల్లిదండ్రులు గుణుపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పొలీసులు సురేందర్‌ సొబొరొను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తానే తన భార్యని హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం గౌరి మృతదేహాన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

మరిన్ని వార్తలు