స్టాలిన్‌ వీరాభిమాని: నాలుక కోసుకుని అమ్మవారికి నైవేద్యం

3 May, 2021 17:52 IST|Sakshi

చెన్నె: సినీ, రాజకీయ ప్రముఖుల కోసం తమిళనాడు ప్రజలు చచ్చిపోయేంత అభిమానం చూపిస్తారు. తమిళుల అభిమానం మామూలుగా ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండడంతో ఓ మహిళా అభిమాని చేసిన పని చూస్తే ఇదేం పిచ్చిరా అనక మానరు. డీఎంకే పార్టీ గెలిచిందని ఓ మహిళ తన నాలుకను కోసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించింది. అలా చేస్తానని ఎన్నికల ముందు మొక్కు తీసుకుందంట. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓట్ల లెక్కింపు పూర్తయి డీఎంకే 133 సీట్లు సంపాదించి ఇంకా తన మిత్రపక్షాలతో కలిసి మొత్తం 159 స్థానాలతో అధికారంలోకి వస్తోంది. దీంతో 32 ఏళ్ల వనిత తెగ సంబరపడిపోయింది. డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుండడంతో సోమవారం ఉదయం వెంటనే ముత్తలమ్మాన్‌ అమ్మవారి ఆలయానికి వెళ్లింది. అయితే కరోనా నేపథ్యంలో ఆలయం మూసివేసి ఉండడంతో గేటు బయట నిల్చుని తన నాలుక కోసుకుంది. తెగిన నాలుకను అమ్మవారికి నైవేద్యంగా గేటు బయట పెట్టేసి వెళ్లిపోయింది. ఆమె నాలుక కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. డీఎంకే గెలవాలని.. గెలిస్తే తన నాలుక కోసుకుంటానని ముత్తలమ్మాన్‌ అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: థియేటర్‌లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్‌ ఫుల్‌’
చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర

      ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వనిత

మరిన్ని వార్తలు