భర్త, అత్తతో గొడవ: కూతురితో సహా తల్లి ఆత్మహత్య

22 Apr, 2021 09:21 IST|Sakshi
పావని పెళ్లినాటి ఫొటో, అన్వేషిక(ఫైల్‌)

సాక్షి, సోన్‌(నిర్మల్‌): అత్తగారింటి వేధింపులకు ఓ యువతి తన కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఆసీఫ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలకేంద్రానికి చెందిన పావనిని నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం లెఫ్ట్‌ పోచంపాడ్‌ గ్రామానికి చెందిన సిద్ది రాములుకిచ్చి 2014లో పెళ్లి చేశారు. వీరికి కుమారుడు హర్షిత్‌ (4), అన్వేషిక (3) ఉన్నారు. సోమవారం రాత్రి ఇంట్లో అత్త, భర్తతో గొడవలు జరిగాయి. తన భర్తకు అత్త వత్తాసు పలుకుతూ.. తనపై గొడవకు ఉసిగొల్పుతోందని పేర్కొంటూ మంగళవారం ఉదయం కూతురిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లి పోయింది.

పుట్టింటికి వెళ్లి ఉంటుందని భావించిన భర్త ఉదయం అక్కడికి వెళ్లాడు. ఇక్కడకూ రాలేదని వారు తెలపడంతో బంధువుల ఇళ్లలో వెతికారు. బుధవారం ఉదయం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో తల్లీకూతురు మృతదేహాలు కనిపించాయి. చేపల వేటకు వెళ్లిన జాలరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై ఆసీఫ్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. పావని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
చదవండి: ఆడపడుచుతో గొడవ: పిల్లలతో బావిలో దూకిన తల్లి

మరిన్ని వార్తలు