8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ, ఎయిడ్స్‌ సోకడంతో..

2 Sep, 2021 12:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హరియాణా, పంజాబ్‌లో అవివాహితులు, భార్య లేని వారే లక్ష్యం

పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు ఏదో వంకతో తెగదెంపులు

ఆట కట్టించిన పోలీసులు

జైలుకు వెళ్లగా ఆమెకు ఎయిడ్స్‌ సోకిందని నిర్దారణ

భయాందోళనలో మాజీ భర్తలు

చండీగఢ్‌: పెళ్లి కావాల్సిన యువకులు.. విడాకులతో ఒంటరిగా ఉన్నవారిని ఏరికోరి పట్టుకుంటుంది. వారిని పెళ్లి చేసుకుంటుంది. పట్టుమని పది రోజులు కూడా కాపురం చేయదు. ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకుంటుంది. ఆ విడాకులకు భారీ ఎత్తున భరణం చెల్లించుకుని ఉడాయిస్తున్న ఓ ఘరానా మహిళ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇలా ఏకంగా 8 మందిని భర్తలుగా చేసుకుని మోసం చేసింది. ఇది ఇలా ఉండగా ఆ 8 మంది భర్తలకు మరో టెన్షన్‌ వచ్చి పడింది. ఆ మహిళకు ఎయిడ్స్‌ సోకింది. దీంతో తమకు కూడా సోకిందేమో ఆందోళనలో ఆ భర్తలు ఉన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

హరియాణా రాష్ట్రం కైతల్‌ జిల్లాకు చెందిన మహిళ 2010లో ఓ వ్యక్తిని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. అయితే నాలుగేళ్ల తర్వాత ఏమైందో ఏమో కానీ ఆమె భర్త అదృశ్యమయ్యాడు. భర్త వదిలేయడంతో ఇక ఏ దిక్కు లేక బతకడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మోసాలకు పాల్పడడం ప్రారంభించింది. హరియాణతోపాటు పక్కనే ఉన్న పంజాబ్‌లోనూ మోసాలు చేయడం మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం భార్యలను కోల్పోయిన వారిని, బ్రహ్మచారులే.
చదవండి: సినిమాను మించిన మర్డర్‌.. మూడు హత్యలతో వరంగల్‌ ఉలిక్కి

తన తల్లితో కలిసి మాటల్లో దింపి అవివాహితులను.. భార్యలను వదిలేసిన వారిని పెళ్లి చేసుకోవడం అలవాటుగా చేసుకుంది. ఏ గుడిలోనూ.. లేదా మరోచోటను నిరాడంబరంగా పెళ్లి చేసుకుని వారితో కాపురం మొదలుపెడుతుంది. పెళ్లయిన పది రోజులకు ఆమె తన డ్రామా మొదలుపెడుతుంది. ఏదో ఒక వంకతో భర్తతో గొడవ పెట్టుకుంది. అనంతరం విడాకులు కోరుతుంది. కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తుంది. ఈ భయంతో ఆమెను చేసుకున్న వారు ఎంతో కొంత భరణంగా ముట్టజెప్పి వదిలించుకుంటారు. ఈ విధంగా రూ.లక్షల్లో దండుకుని ఆమె మకాం మారుస్తుంది. ఇలా ఏకంగా 8 మందిని ఆమె వివాహం చేసుకుంది. ఈమెపై గతంలో కొందరు ఫిర్యాదు చేశారు.

9వ పెళ్లి చేసుకోబోతుండగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఆ పెళ్లిని నిలిపివేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ సోకిందని నిర్ధారణ అయ్యింది. ఆమె ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 8 మంది భర్తలు ఈ విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. తమకు ఎక్కడ సోకిందేమోనని ఆ మాజీ భర్తలు ఆందోళన చెందుతున్నారు. వారికి కూడా పోలీసులు పరీక్షలు చేయించనున్నారు.

మరిన్ని వార్తలు