మందుబిళ్లలు అనుకుని ఎలుకల మందు తిన్న మహిళ

11 Aug, 2021 08:40 IST|Sakshi

రేపల్లె రూరల్‌: సరిగా మతిస్థిమితం లేని మహిళ మందుబిళ్లలనుకుని ఎలుకల నియంత్రణ మందు తీసుకుని మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మండలంలోని చినఅరవపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఫిరోజ్‌ కథనం మేరకు చినఅరవపల్లి గ్రామానికి చెందిన భూపతి వీరరాఘవయ్య భార్య రాజేశ్వరి (42) కొన్నేళ్లుగా మతి స్థిమితం కోల్పోయింది. దీంతోపాటు ఆమె పక్షవాతంతో బాధపడుతోంది. కోలుకునేందుకు మందులు వాడుతోంది.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మందుబిళ్లలనుకుని ఎలుకలు - పందికొక్కులకు వాడే విషగుళికలు తీసుకుని వాంతులు చేసుకుని ఇంట్లో పడిపోయి ఉంది. గమనించిన స్థానికులు ఆమె కుమారుడు అరవింద్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించగా రాజేశ్వరిని హుటాహుటిన రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే రాజేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి అంజనాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు