చెల్లిని ప్రేమించాడని మర్మాంగాన్ని కోసేశారు..

25 Jul, 2021 12:45 IST|Sakshi

పట్నా: బిహర్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ గ్రామంలోని యువతిని ప్రేమించాడనే కోపంతో.. యువకుని పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. ఈ సంఘటన ముజఫర్‌ఫూర్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రేవురా రాంపుర్‌ గ్రామానికి చెందిన సౌరభ్‌ కుమార్ అనే యువకుడు‌, తమ పక్క గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో సౌరభ్‌  ప్రతిరోజు సోర్బారా గ్రామానికి వెళ్లి ప్రియురాలిని కలుస్తుండేవాడు. వీరి ప్రేమ వ్యవహరం యువతి ఇంట్లో వారికి తెలియలేదు.

కొద్ది రోజులుగా యువతి ప్రవర్తన పట్ల ఆమె సోదరులు ఆగ్రహంతో ఉన్నారు. అయితే, గత శుక్రవారం కూడా ఎప్పటిలాగే ఆ ప్రేమికులిద్దరు ఇంట్లో వాళ్లకు తెలియకుండా కలుసుకున్నారు. ఆ రోజున వీరిద్దరు ఒక చోట ఉన్నప్పుడు యువతి సోదరులు పట్టుకున్నారు. సౌరభ్‌ను కోపంతో దూరంగా లాక్కొనిపోయారు. ఇనుపకడ్డీలతో, రాడ్‌లతో విచక్షణ రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. అతని మర్మాంగాన్నికత్తితో కోసేశారు. దీంతో ఆ యువకుడు, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాగా, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, బాధితుడి బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

సౌరభ్‌ను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో సౌరభ్‌  ఆసుపత్రిలో చికిత్సపోందుతూ చనిపోయాడు. కాగా, అతని శరీరంపై కత్తిగాయాలు ఉన్నాయని, దెబ్బలకు తాళలేక చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో కోపంతో రగిలిపోయిన యువకుడి బంధువులు, యువతి ఇంటిముందు సౌరభ్‌ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మృతుడి బంధువులు, యువతి సోదరులపై ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు అశోక్‌ ఠాకుర్‌, రంజిత్‌ కుమార్‌, ముకేష్‌ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, పరారీలో ఉన్న మరికొంత మందిని పట్టుకుంటామని ముజఫర్‌పూర్‌ పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత తలెత్తడంతో, గస్తీని పెంచామని, దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని డీఎస్పీ రాజేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు