కాలం కలిసిరాక.. పంట సరిగ్గా పండక..

3 Dec, 2021 09:22 IST|Sakshi
లక్ష్మణ్‌ (ఫైల్‌) 

సాక్షి, హాలియా (నల్గొండ): అప్పుల బాధతో పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలంలోని వీర్లగడ్డతండాకు చెందిన దేపావత్‌ జబ్బర్‌నాయక్, లక్ష్మి దంపతుల మూడో సంతానం దేపావత్‌ లక్ష్మణ్‌(27) డిగ్రీ పూర్తిచేశాడు. జబ్బర్‌నాయక్‌కి పక్షవాతం వచ్చి కదల్లేని స్థితిలో ఉండటంతో లక్ష్మణ్‌ చదువు మానేసి తమకున్న ఎకరం పొలంతో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టబడి కోసం సుమారు రూ.5 లక్షలు వరకు అప్పులు చేశాడు.

చదవండి:  (గేమ్స్, చాటింగ్‌.. తల్లిదండ్రులు మందలించడంతో..)

కాలం కలిసిరాక.. పంట సరిగ్గా పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక లక్ష్మణ్‌ మంగళవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లక్ష్మణ్‌ను గమనించిన అతడి తల్లి లక్ష్మి ఇరుగు పొరుగు వారి సహాయంతో నల్లగొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు. 

చదవండి: (మొదటి భర్తతో సాన్నిహిత్యం.. తనకు పుట్టలేదనే అనుమానంతో..)

మరిన్ని వార్తలు