సామూహిక లైంగిక దాడి.. మృతదేహానికి పోస్టుమార్టం

8 Oct, 2020 16:52 IST|Sakshi

కొండగావ్‌‌: సామూహిక అత్యాచారానికి గురై రెండు నెలల క్రితం ఆత్మహత్మకు పాల్పడిన ఓ యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో మృతురాలి తండ్రి (మంగళవారం) ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు  యువతి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. వివరాల్లో వెళితే.. కొండగావ్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి జులైలో ఓ వివాహవేడుకు నిమిత్తం బంధువులు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెను ఇద్దరు వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు.

అనంతరం ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఇంటికి వెళ్లిన బాధితురాలు ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలో ఖననం చేశారు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసుల తీరుపై మనస్తాపంతో యువతి తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేసి, అయిదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (చదవండి: కట్టుకథ; ఆడియో రికార్డులు బయటపెట్టండి!)

మరిన్ని వార్తలు