కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే..

15 Sep, 2021 17:22 IST|Sakshi

పెళ్లి చేసుకున్న జంటను తీసుకొచ్చిన కుటుంబీకులు

యువకుడిపై సుత్తి, రాడ్లతో తీవ్ర దాడి

మధ్యప్రదేశ్‌లోని మక్సీలో ఘటన

భోపాల్‌: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు కూడా. అయితే వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయి ఒకచోట వివాహం చేసుకున్నారు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. వారి పెళ్లిపై అమ్మాయి కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కోపాన్ని కప్పిపెట్టి ఆ కొత్తజంట వద్దకు వెళ్లారు. ఇంటికి పదండి.. మీకు ఘనంగా పెళ్లి చేస్తాం’ అని నమ్మబలికారు. తీరా ఇంటికిచ్చాక అమ్మాయిని ఇంట్లో బంధించేసి ఆ యువకుడిని రోడ్డుపైకి లాక్కొచ్చి సుత్తెతో విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ వైరల్‌

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లా మక్సీ నగరానికి చెందిన పుష్పక్‌ భావ్సర్‌ (22). అదే ప్రాంతంలోని ఓ యువతిని ప్రేమించాడు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఇద్దరూ పారిపోయారు. ఒకచోట పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసీ ఇరు కుటుంబసభ్యులు వారిని ఇంటికి పిలిచారు. అందరి సమక్షంలో మీకు ఘనంగా పెళ్లి చేస్తామని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆదివారం ఉదయం పుష్పక్‌ కటింగ్‌ కోసం సెలూన్‌కు వెళ్లాడు. అప్పటికే తీవ్ర కోపంతో ఉన్న యువతి తండ్రి, సోదరుడు వెంటనే సెలూన్‌కు వచ్చి పుష్పక్‌ను బయటకు లాగారు.
చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి

అక్కడే కనిపించిన సుత్తెతో పాటు ఇనుప రాడ్‌తో విచక్షణా రహితంగా తండ్రి, కుమారుడు దాడి చేశారు. కాళ్లపై సుత్తితో దారుణంగా కొడుతున్న వీడియోలు భయాందోళన రేపుతున్నాయి. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఆ వీడియో ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ పంకజ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

మరిన్ని వార్తలు