ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!

21 Nov, 2020 06:23 IST|Sakshi

బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో రగడ

ప్రేమికుడిని నిలదీస్తే దౌర్జన్యం

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

పరారైన నూతన వధూవరులు 

సాక్షి, పలమనేరు/పెద్దపంజాణి: కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తల్లిదండ్రులు కుదిర్చిన వివాహ సంబంధానికి అంగీకరించాడు. ఇది తెలుసుకున్న ప్రియురాలు ఉరుకులు పరుగులతో వచ్చేవేళకే పెళ్లి అయిపోయింది. దీంతో రగిలిపోయిన ఆ యువతి తన ప్రియుడిని నిలదీసింది. వాళ్లు దౌర్జన్యం చేయడంతో పోలీసులను ఆశ్రయించింది. గంగవరం మండలంలోని మిట్టమీద కురప్పల్లెలో శుక్రవారం ఇది చోటుచేసుకుంది.

బాధితురాలి కథనం.. పెద్దపంజాణి మండలానికి చెందిన ఓ యువతి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. అదే కంపెనీలో పని చేసే గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లెకు చెందిన గణేష్‌తో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరువురి తల్లిదండ్రులకు తెలిపారు. అయితే కోవిడ్‌ లక్షణాలున్నాయని గణేష్‌ మూడునెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు బంధువుల అమ్మాయితో గణేష్‌కు పెళ్లి కుదిర్చారు. పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకు చెందిన యువతితో గణేష్‌ స్వగృహంలో గురువారం వేకువజామున వీరికి పెళ్లి జరిగేలా హుటాహుటిన నిర్ణయించారు. (వివాహితది ఆత్మహత్య కాదు.. హత్యే)

వరుడి స్నేహితుల ద్వారా ఇది తెలుసుకున్న పెద్దపంజాణి మండల యువతి బెంగళూరు నుంచి హుటాహుటిన మిట్టమీదకురప్పల్లెకు చేరేలోపు పెళ్లి తంతు ముగిసింది. దీంతో గంగవరం, పెద్దపంజాణి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగలేదు. గురువారం రాత్రి వధువు ఇంటి వద్ద మొదటిరాత్రికి సిద్ధం చేస్తున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లింది. తన ప్రియుడిని నిలదీసింది. దీంతో అక్కడి వ్యక్తులు ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేశారు. నవవరుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. కేసు విషయం తెలుసుకున్న నూతన వధూవరులు మొదటిరాత్రికి స్వస్తి పలికి పరారయ్యారు. తనను  మోసం చేసిన ప్రియుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.  (పెళ్లిరోజే కబళించిన మృత్యువు)

మరిన్ని వార్తలు