అమ్మా నన్ను క్షమించు.. ఈ లోకంలో బతకాలని లేదంటూ..

11 Mar, 2022 19:47 IST|Sakshi

తోటపల్లిగూడూరు(నెల్లూరు జిల్లా): ‘అమ్మా నన్ను క్షమించు.. నాకు ఈ లోకంలో బతకాలని లేదంటూ’ ఓ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగుచూసింది. ఎస్సై ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలం నరుకూరు భీంరావ్‌నగర్‌కు చెందిన గూటం ప్రేమ్‌కుమార్‌(27) ఏసీలు రిపేరు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రేమ్‌కుమార్‌ తండ్రి గూటం పౌల్‌ ఇంటి పక్కన ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వేరుగా కాపురం ఉంటున్నాడు.

చదవండి: బీచ్‌లో దారుణం: ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. యువతిని తోటలోకి లాక్కెళ్లి..

ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రేమ్‌కుమార్‌ ఇంట్లో మంటల వ్యాపించడంతో ప్రేమ్‌కుమార్‌ సోదరుడు ఆనంద్‌ స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చి ఇంట్లోకి వెళ్లారు. వంటింట్లో ప్రేమ్‌కుమార్‌ తీవ్రగాయాలతో కన్పించాడు. చికిత్సనిమిత్తం అతనిని నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ప్రేమ్‌కుమార్‌ చికిత్సపొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ప్రేమ్‌కుమార్‌ రాసిన ఓ లేఖను వంటగదిలో పోలీసులు గురువారం స్వాధీనం చేసుకొన్నారు. ‘అమ్మా నన్ను క్షమించు.. నాకు ఈ లోకంలో బతకాలని లేదు.. అందుకే చనిపోతున్నానని’ ప్రేమ్‌కుమార్‌ రాసిన లేఖను చూసి అతని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.   

మరిన్ని వార్తలు