Tandur: ఇద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. 

27 Oct, 2021 10:19 IST|Sakshi
శాంతుకుమార్‌ (ఫైల్‌)    

చెట్టుకు ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

తాండూరు మండలం గుంతబాసుపల్లిలో ఘటన

ఆత్మహత్యకు ముందు సెల్‌ఫోన్‌లో వీడియో 

సాక్షి, తాండూరు  రూరల్‌: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాండూరు మండలం గుంతబాసుపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతబాసుపల్లికి చెందిన కుర్వ సందప్ప, దస్తమ్మ మొదటి కుమారుడు కుర్వ శాంతుకుమార్‌ (23) హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. తాండూరులో  ఉంటున్న వరుసకు మేనత్త అయిన దేవమ్మ కూతురును మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఇష్టపడ్డారు.
చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌..

శాంతుకుమార్‌ కుటుంబ సభ్యులు సైతం మీ కూతురును మా అబ్బాయికి ఇవ్వాలని తల్లి దేవమ్మను కోరారు. ఇందుకు దేవమ్మ ఒప్పుకోలేదు. దీంతో గత శనివారం హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో శాంతుకుమార్, సంధ్యలు వివాహం చేసుకున్నారు. అమ్మాయి మైనర్‌ కావడంతో తల్లి దేవమ్మ తన కూతురు కనిపించడంలేదని, శాంతుకుమార్‌ కిడ్నాప్‌ చేశాడని తాండూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆదివారం వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అమ్మాయిని తన తల్లి ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ తన కూతురు కనిపించడంలేదని తల్లి, ఆమె సోదరులు శేఖర్, సిద్దు, మహేశ్‌లు సోమవారం ఉదయం శాంతుకుమార్‌ను ఇంటికి వెళ్లి బెదిరించారు. అమ్మాయి ఎటు వెళ్లిందో తనకు తెలియదని ఎంత చెప్పినా వారు వినలేదు.

శాంతుకుమార్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
చదవండి: డెలివరీ బాయ్‌ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో

తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు మంగళవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు అమ్మాయి తల్లితోపాటు ఆమె సోదరులు తనను వేధిస్తున్నారంటూ వీడియో తీశాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు.  మృతుని తండ్రి సందప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే తన కుమారుడి మృతికి కారణమైన దేవమ్మ, ఆమె సోదరులు శేఖర్, సిద్దు, మహేష్‌లపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు