పార్టీకి పిలవలేదని వెళ్లిపోతూ.. మృత్యుఒడిలోకి.. 

2 Jan, 2022 12:45 IST|Sakshi

లారీ ఢీకొని యువకుడు దుర్మరణం

సాక్షి, శ్రీకాకుళం(టెక్కలి రూరల్‌): స్నేహితులు పార్టీకి పిలవలేదనే కోపంతో వెళ్లిపోతున్న యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన స్థానిక జగతిమెట్ట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం వేకువజామున చోటు చేసుకోగా.. నందిగాం మండలం నౌగాం గ్రామానికి చెందిన యువడుకు శిమల ఈశ్వరరావు (20) మృతి చెందాడు.

టెక్కలి ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశ్వరరావు తొలుసూరుపల్లి రోడ్డులో ఉన్న ఓ సప్లయ్‌ దుకాణంలో పనిచేస్తుండేవాడు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాత్రి  తన స్నేహితులు జగతిమెట్ట సమీపంలో మద్యం పార్టీ చేసుకుంటున్నారు. అయితే అక్కడకు వెళ్లిన యువకుడు తనను పిలవకుండా పార్టీ చేసుకుంటారా అంటూ కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోయే క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

చదవండి: (అఘాయిత్యం: బెదిరించి లొంగదీసుకుని.. ఒకరితర్వాత ఒకరిపై..)

తీవ్రంగా గాయపడిన ఈశ్వరరావు అక్కడకక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.  

చదవండి: (భార్యతో వివాహేతర సంబంధం.. భర్తకు తెలిసి వేటకొడవలితో..)

మరిన్ని వార్తలు