తండ్రి కళ్లెదుటే ఘోరం.. ప్రేమతో కొనిచ్చిన స్పోర్ట్స్‌ బైక్‌ మీదే ప్రాణం పోయింది

28 Mar, 2022 18:14 IST|Sakshi
మృతుడు అంజన్న(ఫైల్‌) ప్రేమతో కొనుక్కున్న బైక్‌ 

సాక్షి,  మంచిర్యాలక్రైం: బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న తనయుడు లారీ చక్రాల కింద నలిగి తండ్రి కళ్లెదుటే దుర్మరణం చెందిన విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. హాజీపూర్‌ మండల కేంద్రానికి చెందిన రెబ్బ రాజలింగు– మణెమ్మ దంపతులకు అంజన్న(24), రాజేశ్వరి సంతానం. అంజన్న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ టీవీ షోరూంలో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన తండ్రి రాజలింగుతో కలిసి జైపూర్‌ మండలం షెట్‌పల్లి సమీపంలోని నర్సింగాపూర్‌ గ్రామంలో బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు.

జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాకు రాగానే ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడటంతో బండిని నిలిపివేశారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ సమయం పూర్తి కాగానే అంజయ్య నేరుగా వెళ్తుండగా అతని పక్కనే వచ్చిన లారీ టర్న్‌ తీసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం లారీ టైర్ల కిందకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న అంజయ్య లారీ కిందపడగా అతని తండ్రి రాజలింగు అవతలివైపు పడ్డాడు. దీంతో లారీ టైర్లు అంజన్నవీుదుగా వెళ్లాయి.

రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో తేరుకున్న రాజలింగు విలవిలలాడుతున్న కొడుకును చూసి తల్లడిల్లాడు. అతడిని కాపాడేందుకు చేతుల్లోకి తీసుకోగా.. తీవ్రగా యాలు కావడంతో తండ్రి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. ఘటన స్థలాన్ని ఎస్సై కిరణ్‌కుమార్‌ సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చేతికందిన కొడుకు కానరాని లోకాలకు వెల్లడంతో తల్లిదండ్రులు, చెల్లి రాజేశ్వరి ఆస్పత్రిలో రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.  

ఆరు నెలల క్రితమే బైక్‌ కొనుగోలు.. 
ఇంటర్‌ వరకు చదివిన అంజన్న ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు స్థానికంగా ఓ టీవీ షోరూంలో పనిచేస్తున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్‌ బైక్‌ కొనివ్వాలని అంజన్న ఆరు నెలల క్రితం తండ్రిని అడిగాడు. ఒక్కగానొక్క కొడుకు అడిగిన కోరికను రాజలింగు కాదనలేకపోయాడు. అత్యంత ఖరీదైన స్పోర్ట్స్‌ బైక్‌ కొనిచ్చాడు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే అంజన్న కొత్త బైక్‌పై తండ్రితో కలిసి వెళ్తూ దుర్మరణం చెందడంతో హాజీపూర్‌లో విషాదం నెలకొంది.   

హెల్మెట్‌ బెల్ట్‌ పెట్టుకుని ఉంటే.. 
అంజన్న తలకు హెల్మెట్‌ ధరించినప్పటికీ దానికి ఉన్న బెల్ట్‌ పెట్టుకోలేదు. లారీ ఢీకొనగానే అంజయ్య కిందపడ్డాడు. ఈ సమయంలో హెల్మెట్‌ ఊడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్‌ బెల్ట్‌ ధరించి ఉంటే గాయాలతో బయటపడేవాడేమో అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  

నిక్షిప్తంకాని సీసీ ఫుటేజీ..
ఈ ఏడాది జనవరి 29న ఉదయం 6,30 గంటలకు ఇదే ప్రాంతంలో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. మళ్లీ ఇదే ప్రాంతలో ఆదివారం జరిగిన ప్ర మాదంలో అంజన్న మృతి చెందాడు. అయితే ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తం కాకపోవడం గమనార్హం. పోలీస్‌ అధికారులు సీసీ కెమెరాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదంలో తప్పు ఎవరిదో తెలిసేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు కీలకం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.   

మరిన్ని వార్తలు