యూకే నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

13 Jan, 2022 13:32 IST|Sakshi

సాక్షి, మల్కాజిగిరి/ఏటూరునాగారం : ఉన్నత విద్య కోసం యూకే వెళ్లిన ఆ యువకుడు సెలవులకు ఇంటికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి(26) యూకేలో ఎంఎస్‌ చేస్తున్నాడు. క్రిస్మస్‌ సందర్భంగా అక్కడ సెలవులు ఇవ్వడంతో సొంతవూరికి వచ్చాడు. వచ్చే నెలలో తిరిగి యూకేకు వెళ్లాల్సివుంది.

మల్కాజిగిరిలో ఉంటున్న తన స్నేహితుడు రాహుల్‌ను కలవడానికి బుధవారం తన బైక్‌ మీద మల్కాజిగిరికి వస్తుండగా ఆర్‌.కె.నగర్‌ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో హర్షవర్ధన్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన పై అతని సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన దురదృష్టకరం.. : ఎమ్మెల్యే మైనంపల్లి
ఉన్నత చదువు చదువుకుంటున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలిచివేసిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గతంలో కూడా అదే ప్రాంతంలో జరిగిన ప్రమాదాల్లో మరి కొందరు మృతి చెందినట్లు తెలిసిందన్నారు. ఆ ప్రాంతంలో  స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. 

మరిన్ని వార్తలు