ప్రియురాలి కుటుంబంపై కోపంతో.. 

26 Sep, 2020 16:55 IST|Sakshi
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

ముంబై : ప్రియురాలి కుటుంబంపై కోపంతో ఆమె తండ్రి షాపునకు నిప్పంటించాడో యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మానిక్‌పుర్‌కు చెందిన రాహుల్‌ పాశ్వాన్‌ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబం రాహుల్‌ను హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు సెప్టెంబర్‌ 10వ తేదీన ప్రియురాలి తండ్రికి చెందిన షాపునకు నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ( హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..)

అయితే షాపునకు నిప్పంటుకోవటానికి కారణం షార్ట్‌ సర్క్యూట్‌ అని భావించారంతా. సెప్టెంబర్‌ 21వ తేదీన యువతి తండ్రి తన షాపునకు దగ్గరలోని ఓ షాపునకు సంబంధించిన సీసీ టీవీ కెమెరా ఫొటేజీలను పరిశీలించగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. రాహుల్‌ షాపులోకి నిప్పును పడేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాహుల్‌ కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు