పెళ్లి ఊరేగింపులో వివాదం.. కత్తితో పొడిచి!

12 Dec, 2020 08:14 IST|Sakshi
హత్యకు గురైన లక్ష్మణ్‌(ఫైల్‌) 

సాక్షి, మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలం బీమారంలో పెళ్లి వేడుకల ఊరేగింపులో వివాదం చోటుచేసుకోగా ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాలు మేరకు..మేడిపెల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన పూదరి లక్ష్మణ్‌(21) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి గ్రామంలో ఓ పెళ్లి వేడుకల ఊరేగింపులో డీజే పాటల విషయంలో గ్రామానికి చెందిన పూదరి లక్ష్మణ్, ఓరుగంటి రాజు మధ్య వివాదం జరిగింది. కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లక్ష్మణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి ఓరుగంటి రాజు అనే యువకుడు కత్తిని వెంటతీసుకొని గ్రామంలో తిరిగాడు. (చదవండి: పెళ్లి దండలతోనే మృత్యుఒడిలోకి!)

గ్రామపంచాయతీ సమీపంలో ఒంటరిగా ఉన్న పూదరి లక్ష్మణ్‌ పొట్టభాగంలో రాజు కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. కాసేపటికి మృతుడి సోదరుడు సతీశ్‌ అక్కడికి చేరుకోగా లక్ష్మణ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించాడు. సంఘటన స్థలాన్ని శుక్రవారం కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై సుధీర్‌రావు పరిశీలించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. కాగా మృతుడు లక్ష్మణ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌ కావడంతో రాజుతో గతంలో చిన్న గొడవ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు డీజే పాటల విషయంలో గురువారం రాత్రి వివాదం జరగడంతో లక్ష్మణ్‌ హత్యకు దారితీసిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. డీజే పాటల వివాదంతోనే హత్య
బీమారంలో పెళ్లి వేడుకల్లో డీజే పాటల విషయంలో వివాదం జరగడంతోనే లక్ష్మణ్‌ హత్యకు గురయ్యాడు. హత్య విషయంలో గ్రామంలో అన్నికోణాల్లో ఆరా తీశాం. మృతుడి సోదరుడు సతీష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.            
 – రాజశేఖర్‌రాజు, కోరుట్ల సీఐ 

>
మరిన్ని వార్తలు