విద్యార్థినితో చనువుగా తిరిగి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

11 Aug, 2022 12:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మండపేట(కోనసీమ జిల్లా): పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు వంచించాడన్న మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పెదకాలువ వంతెన వద్ద నివసిస్తున్న దుర్గారావు కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. వారి ఇంటి సమీపంలో నివసిస్తున్న గ్రంధి రాజేష్‌ ప్రేమ పేరిట విద్యార్థిని వెంటపడేవాడు.
చదవండి: వేరే అమ్మాయితో పెళ్లి.. నా చావుకు కారణం ఫణిబాబే

ఈ విషయాన్ని విద్యార్థిని తండ్రి పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాజేష్‌ను మందలించారు. అయినా వినకుండా మాయమాటలు చెప్పి విద్యార్థినితో చనువుగా తిరిగేవాడు. ఇటీవల రాజేష్‌తో పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని బుధవారం ఇంట్లో ఉన్న థైరాయిడ్‌ మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు విద్యార్థినిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతోంది. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు పట్టణ ఎస్‌ఐ ఎం.అశోక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు