ఓ యువతి సైకోలా మారి.. అక్క కొడుకునే దారుణంగా..

5 Oct, 2020 09:29 IST|Sakshi
సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న స్థానికులు

అల్లరి చేస్తున్నాడని అంతం

సాక్షి, యడ్లపాడు/చిలకలూరిపేటటౌన్‌: ఓ యువతి సైకోలా మారి, అక్క కొడుకును దారుణంగా హతమార్చింది. చాకుతో శరీర భాగాలను కోసి పేగులను మెడలో వేసుకుని రక్తం రుచి చూడడం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... గ్రామంలోని ముప్పసాని సుబ్బారావు ఇంటి పై అంతస్తులో నాలుగు నెలల క్రితం షేక్‌ సలాం, ఆషా దంపతులు అద్దెకు దిగారు. భర్త సమీపంలోని ఓ నూలుమిల్లులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి ఆబిద్, షమ్రి ఇద్దరు సంతానం. నరసరావుపేటలో ఉంటున్న ఆషా అక్క ఫాతిమా, ఫరిద్‌బాషా దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో తన పిల్లలు కరిమున్, కరిముల్లా, ఖాజాతో కలిసి చెల్లెలి ఇంటికి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఫాతిమా, ఆమె తల్లి ఖాదర్‌బీ, చిన్న అల్లుడు సలాం కలిసి పనిమీద బాపట్లకు వెళ్లారు. 

అల్లరి చేశాడని.. పట్టరాని కోపంతో.. 
మధ్యాహ్నం పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అక్క కొడుకు కరిముల్లా అల్లరి చేశాడని ఆషా చీపురు కట్టతో కొట్టింది. అంతటితో ఆగక పట్టరాని కోపంతో వంటింట్లో నుంచి చాకు తీసుకొచ్చి బాలుడి చేతిని గాయపరిచింది. భీతిల్లిన కరిముల్లా కాపాడండంటూ పెద్దగా కేకలు వేశాడు. అక్కడే ఆడుకుంటున్న కరిముల్లా సోదరి కరీమున్‌ ప్రాణభయంతో తనతోపాటు మిగిలిన ముగ్గురు పిల్లలను ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియ బిగించింది. కేకలు విన్న ఇంటి యజమాని భార్య మెట్లెక్కి పైకి రావడాన్ని గమనించిన ఆషా.. చాకును చూపించి చంపేస్తానంటూ బెదిరించడంతో ఆమె భయంతో కిందికి వచ్చి భర్తకు చెప్పింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఈలోగా ఇరుగుపొరుగును పిలిచి ఘటనాస్థలికి వెళ్లేసరికి బాబు గొంతును కోసి అక్కడి నుంచి పొత్తి కడుపు వరకు పూర్తిస్థాయిలో కోసి పేగుల్ని బయటకు తీయడాన్ని చూసి జనంలో వణుకు మొదలైంది. ఈలోగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆశా వద్ద ఉన్న చాకును అతి కష్టం మీద లాక్కుని ఆమెను ఇంటి బయటికి తీసుకురావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చిలకలూరిపేట రూరల్‌ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎ.భాస్కర్‌ ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గ్రహించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంటి గడియ తీసి లోపల కన్నీరు కారుస్తూ బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో ఉన్న నలుగురు పిల్లలను సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తకు అప్పగించారు. బాలుడి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు...
జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్న ఆషా తల్లిదండ్రులు, అక్క ఫాతిమా బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. దారుణ పరిస్థితుల్లో మృతి చెందిన తన బిడ్డను చూసుకుని ఫాతిమా, ఆమె తల్లి ఖాదర్‌బీ దుఃఖానికి అంతేలేకుండా పోయింది. తన బిడ్డ చనిపోయాడని ఫాతిమా, తన బిడ్డ ఉన్నట్టుండి ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టింది, వీరిద్దరి భవిష్యత్తు ఏమిటని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్న తల్లి ఖాదర్‌బీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. (దారుణం: లారీతో తొక్కి చంపేశాడు..)

తన ప్రాణంతో పాటు మరో ముగ్గురికి ఊపిరి...
ఫాతిమా సంతానంలో ముగ్గురిలో కరిముల్లా, కరిమున్‌ కవలలు. ఖాజా మూడో సంతానం. పిన్ని తన అన్న కరిముల్లాను చాకుతో చేతిపై కోయడాన్ని గమనించగానే తక్షణమే పరిస్థితిని అర్థం చేసుకున్న కరిమున్‌.. తనతో ఆడుకుంటున్న ముగ్గురి పిల్లలను ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియ పెట్టి వారి ప్రాణాలను ఎంతో ధైర్యంగా కాపాడింది. ఆషా కరిముల్లాను చంపిన తర్వాత కసితీరక తలుపులు గడియలు తీయాలని పలుమార్లు బాదినా భయపడకుండా గడియను కరిమున్‌ తీయలేదు. కరిమున్‌ ధైర్యం చూపి పిల్లలను కాపాడడాన్ని ఊరంతా మెచ్చుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు