పెళ్లి పేరుతో యువతి మోసం.. రూ.ఆరు లక్షలతో పరార్‌

13 Jun, 2021 09:40 IST|Sakshi
సుహాసిని

తిరుపతి క్రైం: పెళ్లి పేరుతో యువతి మోసం చేసి తనను దోచేసిందని ఒక యువకుడు అలిపిరి పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ పరమేశ్వర్‌నాయక్‌ కథనం మేరకు.. విజయపురం మండలం నారపురాజు కండ్రికగకు చెందిన సునీల్‌కుమార్‌ (29) మార్కెట్‌ జాబ్‌ చేసుకుంటూ ఐదేళ్లుగా సత్యనారాయణపురంలో ఉంటున్నా డు. అతనికి ఏడీబీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఎం.సుహాసినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుహాసిని అనాథ అని చెప్పడంతో గత ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

సునీల్‌కుమార్‌ పెద్దలు 20 గ్రాముల బంగారు నగలు సుహాసినీకి తీసిచ్చారు. కొద్దిరోజుల క్రితం తనను చిన్నప్పటి నుంచి చూసుకున్న వారికి ఆరోగ్యం సరిగాలేదని, తాను పెళ్లికి ముందు కొన్ని అప్పులు చేశానని చెప్పి రూ.4 లక్షలు, వాళ్ల మామ వద్ద రూ.2 లక్షలు ఇప్పించుకుంది. ఈ విషయాలు తెలుసుకుని ఈ నెల 7న ఇంట్లో వారు నిలదీయడంతో మరుసటి రోజు నుంచి ఆమె కన్పించకుండా పోయింది.

ఆధార్‌కార్డు ఆధారంగా నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమై కుమార్తె ఉన్నట్లు సునీల్‌కుమార్‌ గుర్తించాడు. ఇదిలా ఉండగా సుహాసిని ఫోన్‌ చేసి హైదరాబాద్‌లో ఉన్నానని, త్వరలోనే డబ్బులు ఇస్తానని, పోలీసులను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని బెదిరించింది. ఏడాదన్నర క్రితం మరో పెళ్లి కూడా చేసుకున్నట్లు సునీల్‌కుమార్‌ సెల్‌కు ఫొటోలను వాట్సాప్‌ చేసింది. వీటిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సునీల్‌కుమార్‌ అలిపిరి పోలీసులను అశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: గుంటూరులో సైకో వీరంగం    
దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి..

మరిన్ని వార్తలు