Tejasri: శారీరకంగా వాడుకున్నాడు.. ముఖం చాటేశాడు

7 Oct, 2022 09:06 IST|Sakshi
తేజశ్రీ (ఫైల్‌) 

సాక్షి, నెన్నెల (మంచిర్యాల): ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని బెల్లంపల్లి షంషీర్‌నగర్‌కు చెందిన సోయం తేజశ్రీ(22) పురుగుల మందు తాగి గురువారం మృతి చెందింది. ఎస్సై రాజశేఖర్‌ వివరాల ప్రకారం.. తేజశ్రీ, నెన్నెల లంబాడితాండకు చెందిన దరావత్‌ రాజ్‌కుమార్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు.

ఈ క్రమంలో రాజ్‌కుమార్‌ పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తరువాత పెళ్లికి నిరాశక్తి చూపించాడు. రాజ్‌కుమార్‌ను రెండు రోజుల క్రితం నిలదీయడంతో ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని మనస్తాపంతో బుధవారం పురుగుల మందు తాగి నెన్నెల పీహెచ్‌సీ ఆవరణలో పడిపోయింది. గమనించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి ప్రథమ చికిత్స నిర్వహించి 108 అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. తన బిడ్డ చావుకు కారణమైన రాజ్‌కుమార్‌ అతని కుటుంబ సభ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలు తల్లి సోయం లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్‌ నోట్‌లో ప్రియుడితో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

చదవండి: (పెళ్లయిన వ్యక్తితో సహజీవనం.. కారులో మంత్రాలయం వచ్చి..) 

మరిన్ని వార్తలు