Gorantla Sathya Sai Crime: పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అం‍తలోనే..

6 May, 2022 08:20 IST|Sakshi
తేజస్విని (ఫైల్‌).. పోలీసుస్టేషన్‌ ఎదుట మృతురాలి బంధువుల ఆందోళన

ప్రియుడే చంపాడని బంధువుల ఆందోళన  

సాక్షి, గోరంట్ల (సత్యసాయి జిల్లా): యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మల్లాపల్లిలో చోటు చేసుకుంది.  సీఐ జయనాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. గోరంట్ల పట్టణానికి చెందిన గోపీకృష్ణ కుమార్తె తేజశ్విని (22) తిరుపతిలో బీఫార్మసీ చదువుతోంది. తమ వీధిలోనే నివాసముంటున్న ముస్తఫా (లేట్‌), హసీనా దంపతుల కుమారుడు సాధిక్, తేజస్విని కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

మండలంలోని మల్లాపల్లి సమీపంలో ఇటుక బట్టీ నడుపుతున్న సాధిక్‌ అక్కడే ఓ రేకుల షెడ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. సాధిక్‌ అక్కడ ఉన్నాడని తెలుసుకున్న తేజశ్విని గురువారం కళాశాల నుంచి నేరుగా సాధిక్‌ వద్దకు వచ్చింది. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని తేజశ్విని కోరగా, తన తల్లిని అడిగి వస్తానని సాధిక్‌ గోరంట్లకు వచ్చేశాడు. అతను తిరిగి వెళ్లి చూసే సరికి తేజశ్విని ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.

చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..)

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తండ్రి గోపికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్‌ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బంధువులు తేజశ్విని మృతదేహంతో గోరంట్ల పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రేమ పేరుతో సాధిక్‌ తమ బిడ్డను హత్య చేశాడని, నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ గోరంట్ల పోలీసుస్టేషన్‌ చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. పారదర్శకంగా కేసును విచారిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.  

చదవండి: ('లోన్‌ కట్టకపోతే.. న్యూడ్‌ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం') 

మరిన్ని వార్తలు