అక్క మరిది బలవంతం.. యువతి ఆత్మహత్య

9 Nov, 2020 07:34 IST|Sakshi
లావణ్య (ఫైల్‌) 

సాక్షి, విశాఖపట్నం: తనను పెళ్లి చేసుకోవాలని అక్క మరిది బలవంతం చేయడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జీవీఎంసీ 4వ వార్డు గంగడపాలెంలో వాసుపల్లి లావణ్య(21) నివాసం ఉంటుంది. ఈమె చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఇదే ప్రాంతానికి చెందిన పిన్ని ముకర కనక, గురునాథ్‌ల వద్ద అక్క అరుణతో కలిసి పెరిగింది. కొంత కాలం క్రితం అరుణకు ఫిషింగ్‌ హార్బర్‌లో ఉంటున్న రాము అనే వ్యక్తితో వివాహమైంది. రాము తమ్ముడు మురళి.. లావణ్యను పెళ్లి చేసుకోవాలంటూ రోజూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో వేధింపులు తాళలేక శనివారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న తరువాత ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని లావణ్య ఆత్మహత్య చేసుకుంది. ఈమె తగరపువలసలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.    (వివాహానికి నిరాకరించడంతో.. ప్రియుడి కళ్లెదుటే కిరోసిన్‌)

వివాహిత అనుమానాస్పద మృతి
అల్లిపురం(విశాఖ దక్షిణ): ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆదివారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.వెంకటరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అల్లిపురం కుమ్మరవీధికి చెందిన అనకాపల్లి నూకరాజు కేటరింగ్‌ పనులు చేస్తుంటాడు. అతని భార్య సంతోష్‌కుమారి(34) మానసికంగా బాధపడుతోంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో నూకరాజు పని మీద బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి 9.30 గంటల సమయంలో వచ్చాడు. ఆ సమయంలో ఇంటి తలుపులు మూసివేసి ఉండడం, ఎంత కొట్టినా తీయకపోవడంతో స్థానికులను పిలిచి విరగొట్టి తెరిచారు. లోపలికి వెళ్లి చూడగా.. సంతోషికుమారి ఇంట్లో దూలానికి చీరతో ఉరిపోసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను స్థానికుల సహకారంతో కిందకు దించారు. అప్పటికి కొన ఊపిరితో ఉన్న ఆమెను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి ఆమె మృతి చెందిందని తెలియజేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  (తునిలో ఎన్నారై సురేశ్‌ మృతి కలకలం.. భార్యే..!)

మరిన్ని వార్తలు