ప్రియుని వెంటే నేనంటూ..

11 Feb, 2021 21:28 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కుటుంబ సభ్యులు ప్రేమకు అడ్డుచెప్పారనే ఆవేదనతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియున్ని కడసారి చూడాలని వచ్చి ప్రియురాలు సైతం శవమైంది. ఈ ఘటన తుమకూరు జిల్లా చిక్కనాయకహళ్లిలోని మారుతినగరలో జరిగింది. ఆ ప్రేమజంట దీక్షిత్, పంచాక్షరి. దీక్షిత్‌ స్వస్థలం చిక్కనాయకనహళ్లి కాగా, బెంగళూరులోని పి.దాసరహళ్లిలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడు మండ్య  జిల్లా మద్దూరు తాలూకా, కొప్ప గ్రామానికి చెందిన  పంచాక్షరితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.  అమ్మాయి ఎస్సీ, అబ్బాయి బీసీ వర్గీయులు. పెళ్లి చేసుకోవాలని అనుకోగా, వారిరువురి కుటుంబాలు తీవ్రంగా అడ్డుపడ్డాయి. దీంతో తమ ప్రేమ ఫలించలేదని దీక్షిత్‌ విరక్తి చెందాడు.   

ఎలా  జరిగిందంటే ..  
దీక్షిత్‌ ఫిబ్రవరి 7న ఇంటికి వచ్చి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుని మరణ వార్త తెలుసుకున్న పంచాక్షరి అతని ఇంటిని వెతుక్కుంటూ చిక్కనాయకనహళ్లికి వచ్చింది. ఏమైందోగానీ బుధవారం ఇంటి వద్ద చిల్లర అంగడి వద్ద ఉరేసుకుని శవమైంది. యువతి తల్లిదండ్రులకు విషయం తెలిసి విలపించారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించారు. అబ్బాయి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.  

మరిన్ని వార్తలు