ఆస్తి గొడవ.. అన్నను కొట్టి చంపిన తమ్ముడు

27 Jan, 2021 10:56 IST|Sakshi

సాక్షి, నల్గొండ: భూమి తగాదాలతో సొంత తమ్ముడిపై హత్యకు పాల్పడ్డాడు ఓ అన్న. ఈ ఘటన జిల్లాలోని నాంపల్లి మండలంలోని బండ తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తాటిమీదిగూడెంలో చోటు చేసుకుంది. వివరాలు.. బొదాసు కృష్ణయ్య తన తమ్ముడు బొదాసు వెంకటయ్య (55)కు తొమ్మిదెకరాల భూమిని ఎనిమిదేళ్ల క్రితం అమ్ముకుని హైదరాబాద్‌కు వలసవెళ్లాడు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో గ్రామానికి వచ్చిన కృష్ణయ్య తన తమ్ముడికి భూమిని అమ్మలేదని వాగ్వాదానికి దిగాడు. వీరి ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. కాగా వెంకటయ్య కుమారుడు భాస్కర్‌ వ్యవసాయ పనులు చేస్తుండగా బొదాసు కృష్ణయ్యతో పాటు అతని కుమారులు అక్కడకు వెళ్లి గొడవకు దిగి దాడికి యత్నించారు.

దీంతో భాస్కర్‌ గ్రామంలోకి పరుగులు తీశాడు. భాస్కర్‌ను వెంబడిస్తున్న విషయాన్ని తెలుసుకున్న అతని తండ్రి వెంకటయ్య తన అన్న, అన్న కొడుకులను అడ్డుకున్నాడు. దీంతో వారు వెంకటయ్యపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో ఉన్న వెంకటయ్యను స్థానికులు 108 ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

మరిన్ని వార్తలు