రక్షించినా.. మళ్లీ దూకాడు 

26 Jul, 2022 01:39 IST|Sakshi
ఆంజనేయులు 

వెల్దుర్తి(తూప్రాన్‌): హల్దీవాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మొదటి సారి వాగులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అతడిని స్నేహితులు, గ్రామస్తులు రక్షించారు. అంతలోనే మళ్లీ దూకడంతో గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌కు చెందిన మర్కంటి ఆంజనేయులు(19) ఆదివారం రాత్రి వేళ గ్రామ శివారులోని హల్దీవాగు బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

గమనించిన స్నేహితులు, గ్రామస్తులు అతన్ని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఘటనా విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడానికి కొందరు గ్రామానికి వెళ్లగా, రక్షణగా ఉన్నవారి కళ్లుగప్పి మళ్లీ వాగులోకి దూకాడు. రెండోసారి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెల్దుర్తి పట్టణానికి చెందిన గజ ఈతగాళ్లతో సోమవారం గాలింపు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. మంగళవారం మరోసారి వెదకనున్నట్లు ఎస్సై మధుసూదన్‌గౌడ్‌ తెలిపారు. కాగా యువకుడి తండ్రి యాదయ్య గతంలోనే మృతి చెందాడు.  

మరిన్ని వార్తలు