మహిళతో వివాహేతర సంబంధం.. ఎంత నచ్చజెప్పినా మారలేదని..

5 Dec, 2021 14:01 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాస్‌

సాక్షి,రెబ్బెన(ఆసిఫాబాద్‌): మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడనే అనుమానమే రెబ్బెన మండలంలోని నవేగాంకు చెందిన వేల్పుల ఇందూర్‌ అలియాస్‌ ఇంద్ర(18) హత్యకు దారి తీసింది. ఎంత నచ్చజెప్పినా ఇందూర్‌ పద్దతి మార్చుకోకపోవడంతో కక్ష పెంచుకున్న వేల్పుల రాజలింగు దారుణంగా హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నవేగాంకు చెందిన హతుడు వేల్పుల ఇందూర్, నిందితుడు వేల్పుల రాజలింగులు పాలి అన్నదమ్ముల కొడుకులు.

తమ సంబంధికులకు చెందిన మహిళతో ఇందూర్‌ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడన్న అనుమానంతో రాజలింగు కక్ష పెట్టుకున్నాడు. ఈక్రమంలో ఈనెల 1న సాయంత్రం ఇంటి ఎదుట ఉన్న చావడిలో ఇందూర్‌ కాళ్లు చేతులు కడుక్కునే పనిలో ఏమరపాటుగా ఉండడాన్ని గమనించిన రాజలింగు పదునైన కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై కిందపడిపోగా వెంటనే కర్రతో తలపై బలంగా మోదడంతో ఇందూర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి మధునయ్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందుతుడి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రెబ్బెన సీఐ సతీష్‌కుమార్, ఎస్సై భవానీసేన్‌ ఉన్నారు. 

చదవండి: ఆ భూమి మాది, నేను మంత్రి గన్‌మెన్‌ని.. తలుచుకుంటే..

మరిన్ని వార్తలు