వైఎస్సార్‌సీపీ నాయకుడి దారుణ హత్య

24 Aug, 2020 09:18 IST|Sakshi

ప్రకాశం జిల్లాలో దుశ్చర్య

సాక్షి, ప్రకాశం : వైఎస్సార్‌సీపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని తాళ్లురు మండలం రజానగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, హతుని భార్య కథనం ప్రకారం.. మారం సుబ్బారెడ్డి(64) అలియాస్‌ భూమిరెడ్డి సుబ్బారావు తన ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి ప్రహారీ దూకి వచ్చి ఒక్కసారిగా తలపై, మెడపై తీవ్రంగా నరికి చంపారు.(చదవండి : దారుణం: కత్తితో గొంతు కోసి..)

ఆ సమయంలో భార్య పాల కోసం గ్రామంలోకి వెళ్లింది. అర్థగంట తరువాత వచ్చి చూడగా భర్త ఒళ్లంతా రక్తంతో కుర్చీలో వాలి ఉండటంతో భయంతో కేకలు వేయడంతో, అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుబ్బారావు మృదుస్వభావి. ఆయన గతంలో బెంగళూరులో బ్రిక్స్‌ వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం గ్రామంలోనే దానిమ్మ తోటలను సాగు చేసుకుంటున్నారు. హత్యకు గల కారణాలేమిటనేది తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని ఎస్‌ నాగరాజు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు