చిన్నారులను కాపాడేందుకు స్పెషల్‌ టాస్క్ ఫోర్స్: కేజ్రీవాల్

19 May, 2021 17:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో అతలాకుతలమైన ఢిల్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే, కొవిడ్-19 ధ‌ర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌ మూడో దశలో చిన్నారుల‌పై ఎక్కువగా ప్రభావం చూపనుందనే ఆందోళన‌ల నేప‌థ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చర్యలకు సమయాత్తమయ్యారు. పిల్ల‌ల‌ను కరోనా బారినుంచి కాపాడేందుకు ఓ ప్ర‌త్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయించామని ఆయన బుధ‌వారం ప్ర‌క‌టించారు.

కొవిడ్-19 సెకండ్ వేవ్ నియంత్రణ, త‌గిన‌న్ని ఆక్సిజ‌న్ బెడ్లు, కీల‌క ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ ప‌రిక‌రాల‌ను సిద్దం చేయడంపై అధికారుల‌తో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని అధికారులను ఆదేశించారు. అధికారుల‌తో జ‌రిగిన భేటీలో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనే దిశ‌గా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని సీఎం కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు సింగ‌పూర్ స్ట్రెయిన్‌ థ‌ర్డ్ వేవ్ భార‌త్ లో చిన్నారుల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని కేజ్రీవాల్ చేసిన మంగళవారం చేసిన వ్యాఖ్య‌ల‌ను చర్చనీయాంశమయ్యాయి. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను సింగ‌పూర్ ఆక్షేపించడంతో కేంద్ర ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. కొవిడ్ వేరియంట్స్ పై మాట్లాడే సాధికార‌త కేజ్రీవాల్ కు లేద‌ని స్పష్టం చేసింది. అయితే కేంద్రం తీరుపై ఆప్ విరుచుకుప‌డింది. భార‌త్ లో థ‌ర్డ్ వేవ్ తో చిన్నారుల‌కు వాటిల్లే న‌ష్టంపై ఢిల్లీ ప్ర‌భుత్వం క‌ల‌త చెందుతుంటే కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం సింగ‌పూర్ తో సంబంధాల గురించే ఎక్కువ‌గా ఆందోళ‌న చెందుతోంద‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా చురకలంటించారు.
(చదవండి:సీఎం కుమారుడు రూల్స్‌ బ్రేక్‌: భార్యతో కలిసి..)

మరిన్ని వార్తలు