ఏపీ పథకంపై కేంద్రానికి ఢిల్లీ సీఎం విజ్ఞప్తి

20 Mar, 2021 17:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ‘ఇంటింటికి రేషన్‌ బియ్యం’ పంపిణీ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ఈ పథకం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఇక పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ తాము వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ పథకం అమలు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. అయితే ఢిల్లీలో ఈ పథకం అమలు విషయంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వానికి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.

చదవండి: సీఎం జగన్‌ పథకాల స్ఫూర్తితో మమతా బెనర్జీ

‘దీనికి ముఖ్యమంత్రి రేషన్‌ యోజన అనే పేరు పెట్టడం లేదు. ఈ పథకానికి ఎలాంటి పేరు లేదు’ అని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. పేదలకు అందించే చౌకధరల వస్తువల సరఫరాలో మాఫియా ప్రవేశించిందని.. వారిని నుంచి కాపాడేందుకు ఇంటింటికి రేషన్‌ అమలు చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం వివరణ ఇచ్చారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగానే ఇంటింటికి రేషన్‌ పథకం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఢిల్లీ ఆహార శాఖ మంత్రి సంయుక్త కార్యదర్శి జగన్నాథన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఈ పథకం కేంద్రానిదే, మేం కేవలం అదనపు సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ వివరణ ఇచ్చారు. మార్చి 25వ తేదీన ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించనున్నారు. సహదార జిల్లా సీమపురి ప్రాంతంలో ఈ పథకం అమలు చేయనున్నారు. అనంతరం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఢిల్లీ అంతటా అమలు చేసే యోచనలో ఢిల్లీ ప్రభుత్వం ఉంది. 

మరిన్ని వార్తలు