మామిడికుదురు: అప్పనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ పి.సురేష్బాబు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. పీడీ సురేష్బాబు ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతడి తీరుపై విద్యార్థిని కుటుంబ సభ్యులు ప్రధానోపాధ్యాయుడు జి.సాయిబాబుకు ఇటీవల ఫిర్యాదు చేశారు. హెచ్ఎం సాయిబాబు ఈ సమస్యను సర్పంచ్ గెడ్డం మంగాదేవి దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ గత నెల 21 నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ పీడీతో సెలవు పెట్టించారు. ఈ నెల 24, 25 తేదీల్లో కూడా పీడీ సెలవు పెట్టారు. తిరిగి సోమవారం నుంచి సురేష్బాబు విధులకు హాజరు కావడంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న సమస్య భగ్గుమంది. విద్యార్థిని నడుముపై చేయి వేయడం, వారికి తెలియకుండా వీడియోలు తీయడం, ఈమె మీ పిన్ని అంటూ విద్యార్థినులకు పరిచయం చేయడం వంటి అనైతిక చర్యలకు పీడీ పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే పిల్లల్ని ఎలా చదివించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీడీ అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఏడెనిమిది ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో పీడీని హెచ్ఎం సోమవారం స్కూల్ నుంచి పంపించి వేశారు. పీడీ సురేష్బాబు గతంలో పెదపట్నంలంక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పని చేసిన సమయంలో కూడా ఇదే విధంగా అసభ్యంగా ప్రవర్తించేవాడని చెబుతున్నారు. పీడీ సురేష్బాబు వ్యవహారంపై హెచ్ఎం సాయిబాబును వివరణ కోరగా తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమని చెప్పారు. అతడిని సెలవుపై పంపించామన్నారు. పీడీని ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తామని సర్పంచ్ మంగాదేవితో పాటు పెద్దలు హామీ ఇచ్చారని చెప్పారు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. విధి నిర్వహణలో కచ్చితంగా ఉంటున్నందు వల్లనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పీడీ సురేష్బాబు ‘సాక్షి’కి చెప్పారు. దీనిపై ఎంఈఓ కోన హెలీనాను ‘సాక్షి’ సంప్రదించగా.. హెచ్ఎం ద్వారా వివరాలు తెలుసుకున్నానని, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు.
విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన
ఆలస్యంగా వెలుగు చూసిన వైనం