డిక్కీలో ఉంచిన రూ.9.91 లక్షల చోరీ

19 Mar, 2023 02:20 IST|Sakshi

సామర్లకోట: స్థానిక పెద్దాపురం రోడ్డులోని యూనియన్‌ బ్యాంకు వద్ద స్కూటర్‌ డిక్కీలో ఉంచిన నగదు చోరీ అయ్యింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్‌ సీపీ నాయకుడు, చిరు వ్యాపారి పుట్టా సూరిబాబు తనకు చెందిన ఒక షాపు విక్రయానికి సంబంధించి అడ్వాన్సుగా వచ్చిన మొత్తం రూ.9.91 లక్షలు యూనియన్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేయడానికి శనివారం వెళ్లారు. ఒకేసారి అంత మొత్తం డిపాజిట్‌ చేస్తే ట్యాక్స్‌ పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆ మొత్తాన్ని తన స్కూటర్‌ డిక్కీలో ఉంచారు. ఆ సొమ్మును నాలుగు వాయిదాల్లో బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకుని, ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంటి వద్ద డిక్కీ తెరచి చూడగా సొమ్ము కనిపించలేదు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దాపురం సీఐ అబ్దుల్‌ నబీ, సామర్లకోట సీఐ కె.దుర్గాప్రసాద్‌, క్రైం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు సీఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు