Engineers Day: మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. భారత ఇంజనీరింగ్‌ రత్నం

15 Sep, 2021 09:44 IST|Sakshi

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యని భారతీయ ఇంజనీరింగ్‌ రంగానికి పితామహుడుగా అభివర్ణించవచ్చు. తన నైపుణ్యాలతో, ఇంజనీరింగ్‌ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధివైపు అడుగులు వేయిస్తూ దేశానికి సారథ్యం వహిం చారు. విశ్వేశ్వరయ్య గారు కర్ణాటకలోని మైసూర్‌ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో జన్మించారు. అనేక కష్టనష్టాలకు సైతం ఓర్చుకొని విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ట్యూషన్‌లు చెప్పుకుంటూ ఇంజనీరింగ్‌ విద్యను పూర్తిచేసి మొదటి ర్యాంకు సాధించారు. చదువు పూర్తయిన వెంటనే మహరాష్ట్రలోని నాసిక్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగం పొందాడు. 

దేశానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం, పరిశ్రమలే అవసరమని గుర్తించి వాటిని వృద్ధిలోకి  తీసుకురావడం ద్వారా అనేక సేవలు చేశాడు. 101 సంవత్సరాల తన జీవితంలో  దాదాపుగా 80 ఏళ్లు దేశం కోసం అహర్నిశలు పని చేశాడు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1955లో భారతరత్న ప్రదానం చేసి సత్కరించింది. విశ్వేశ్వరయ్య ఈ దేశానికి చేసిన సేవలకు గాను 1968లో తన పుట్టినరోజును జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

హైదరాబాద్‌లో 1908లో మూసీ నదికి వరదలు వచ్చాయి. నాటి అల్లకల్లోలమైన పరిస్థితుల్లో అనేక వంతెనలు నిర్మించి మూసీ నదికే ముక్కుతాడు వేసిన ఇంజనీర్‌ విశ్వేశ్వరయ్య. నాసిక్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా సింధూ నది నీటిని సుక్కూరు ప్రాంతానికి అంటే దాదాపుగా 480 కిలోమీటర్లు తీసుకురావడం కోసం విశ్వేశ్వరయ్య చేసిన యోచన చూసి మిగతా ఇంజనీర్లు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత నీటిపారుదలపై మహరాష్ట్రలో పలు కమిటీలు వేసినప్పుడు విశ్వేశ్వరయ్య సలహాలు విని బ్రిటిష్‌ అధికారులు సైతం అవాక్కయ్యారు. ఇరిగేషన్‌లో బ్లాక్‌ సిస్టమ్‌ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్ధమైన నీటిని నిల్వ చేసి మరల వాడేవారు.

1952లో అంటే 91 సంవత్సరాల వయసులో గంగానది మీద బ్రిడ్జి కట్టడానికి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తన జీవితమంతా తన నైపుణ్యాన్ని దేశ నిర్మాణానికి వినియోగించారు. తన దార్శనికత వల్లే నేటికీ కర్ణాటక మైసూర్‌ బలంగా, సుసంపన్నంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నేటి భారతీయ సమాజంలో ఉన్న నవ యువ ఇంజనీర్లమైన మనం సమాజంలో ఉన్న సమస్యలకు ఇంజనీరింగ్‌ రంగం ద్వారా పరిష్కారం వెతికి దేశం ముందుంచాలి. అప్పుడే విశ్వేశ్వరయ్య ఆశయాలు, కలలు సాకారమవుతాయి. – జవ్వాజి దిలీప్, జేఎన్టీయూ ‘ 78010 09838 (నేడు ఇంజనీర్స్‌ డే – విశ్వేశ్వరయ్య జయంతి) 

మరిన్ని వార్తలు