సర్కారీ కొలువుల జాతర

17 Jun, 2022 00:09 IST|Sakshi

కొత్తగా పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్టు వెలువడిన కథనం చిరకాలంగా కొలువుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతలో ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం పర్యవసానంగా వచ్చే ఏడాదిన్నరకాలంలో 77 మంత్రిత్వశాఖల పరిధిలోని వివిధ విభా గాల నుంచి వరస నోటిఫికేషన్లు హోరెత్తుతాయి.

కొత్తగా ఉద్యోగాలిస్తే జీతాల కోసం అదనంగా ప్రతి నెలా రూ. 4,500 కోట్లు వ్యయమవుతుందని ఒక అంచనా. అంటే ఏటా ప్రభుత్వానికి రూ. 54,000 కోట్ల అదనపు ఖర్చుంటుంది. ఈ ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ వగైరాలకయ్యే వ్యయం అదనం. వీరందరికీ మున్ముందు పదోన్నతులు ఇవ్వాల్సివచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలు సరేసరి.

అసలు ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయి రిక్రూట్‌మెంట్‌ ఆచరణలో సాధ్యమేనా అన్న సందేహం కూడా వస్తుంది. ఒక క్రమపద్ధతిలో అవసరానికనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే సమస్యలుండవు. ఆ విభాగాలు ఎలాంటి అంతరాయమూ లేకుండా సేవలందించడం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఒకేసారి జాతర మాదిరిగా ఉద్యోగాల భర్తీ చేపడితే నిరుద్యోగులకూ ఇబ్బందే.

ఏ ఉద్యోగం వస్తుందో, ఏది రాదో తెలియక అన్ని పరీక్షలకూ హాజరుకావాల్సి వస్తుంది. తాము అధికారంలో కొచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఆ విషయంలో అడపా దడపా విమర్శలు వస్తున్నా కేంద్రంలోని పెద్దలు పట్టించుకోలేదు. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలేనా అని కొందరు సచివులు ఎదురు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

నిరుద్యోగ పెనుభూతం యువతరాన్ని ఎంతగా పీడిస్తున్నదో తెలియడానికి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ పథకంపై బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, గురుగ్రామ్‌ తదితరచోట్ల వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలే నిదర్శనం. రైల్వే ఆస్తులను, బస్సులను ధ్వంసం చేయడం, రహదారుల దిగ్బంధం వంటి ఘటనలు చూస్తుంటే యువత ఎంతగా నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయారో అర్ధమవు తుంది.

1994 గణాంకాల ప్రకారం కేంద్రంలో 41.76 లక్షల ఉద్యోగాలుండేవి. 2014 నాటికి వాటి సంఖ్య 39.9 లక్షలు. 2021 లెక్కల ప్రకారం కేంద్ర సిబ్బంది 34.5 లక్షల మంది. వీరుగాక చిన్నా చితకా ఉద్యోగాలతో సహా కేంద్రంలో 24.30 లక్షలమంది కాంట్రాక్టు నియామకాల కింద పనిచేస్తు న్నారు. కేంద్ర సిబ్బందిలో 92 శాతం మంది కేవలం ఐదు మంత్రిత్వ శాఖల్లో ఉంటారని చెబుతారు.

ఇందులో 40 శాతం వాటాతో రైల్వేలు అగ్రభాగాన ఉంటే... హోంశాఖలో 30 శాతం, రక్షణ (పౌరవిభాగం)లో 12 శాతం సిబ్బంది ఉంటారు. నిజానికి బయట దొరికే ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాల శాతం చాలా తక్కువ. మన జీడీపీ ఘనంగా కనబడటానికి తోడ్పడుతున్న సేవారంగంలో ఉద్యోగాలకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతాయి. పైగా అక్కడా సాంకేతికత పెరిగి గతంతో పోలిస్తే ఉద్యోగావకాశాలు క్షీణిస్తున్నాయి.

ఏటా కొత్తగా ఉద్యోగ మార్కెట్‌లోకి వచ్చేవారు కోటీ 20 లక్షలమంది అని ఒక అంచనా. వీరిలో ఎందరికి ఉద్యోగాలు దొరుకుతాయి? వీరికన్నా చాలా ఏళ్లముందునుంచీ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారి మాటేమిటి? పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడే ధోరణి కనబడదు. అక్కడ రెండు రంగాల్లో లభించే వేతనాలకూ పెద్దగా వ్యత్యాసం ఉండదు. కానీ మన దేశంలో వేరు. ప్రభుత్వ సిబ్బందికి నిర్ణీత వ్యవధిలో వేతన సవరణ సంఘాల సిఫార్సులు వస్తాయి. కాస్త వెనకో ముందో వాటిని అమలు చేస్తారు.

ఇవిగాక ప్రైవేటు రంగంతో పోలిస్తే ఇతరత్రా సదుపాయాలు, క్రమం తప్పకుండా వచ్చే పదోన్నతులు అదనం. ప్రైవేటు రంగ సిబ్బంది యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలి. కార్మికసంఘాలు బలహీనపడ్డాయి గనుక ఉద్యోగులకు దినదినగండంగా ఉంటున్నది. లేబర్‌ కోర్టులు వగైరాలవల్ల పెద్దగా ఒరిగేది ఉండదు.

ప్రైవేటు రంగంలో కూడా మెరుగైన పరిస్థితు లుండేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు లేకపోగా... రేపో మాపో అమల్లోకి రానున్న లేబర్‌ కోడ్‌ వల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నమవు తాయని బీజేపీ అనుకూల కార్మికసంఘంతో సహా అన్ని సంఘాలూ ఆరోపిస్తున్నాయి. ఈ కారణాల వల్లే ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడేవారు నానాటికీ పెరుగుతున్నారు.

నిరుద్యోగంపై కేవలం కేంద్రాన్ని మాత్రమే తప్పుబట్టడం కుదరదు. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదానితో నిమిత్తం లేకుండా 90వ దశకం మధ్యనుంచీ అన్ని రాష్ట్రాల్లోనూ సర్కారీ కొలువులు తగ్గిపోయాయి. తాను అధికారంలోకొస్తే యువతకు ఉద్యోగాలిస్తాననీ, లేనట్టయితే నిరుద్యోగ భృతి ఇస్తాననీ 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు తాను పాలించిన ఐదేళ్లూ ఉద్యోగాలూ ఇవ్వలేకపోయారు, నిరుద్యోగ భృతిని కూడా అందించలేకపోయారు.

చివరకు 2019లో అధికారం లోకొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం భారీయెత్తున యువతకు ఉద్యోగాలిచ్చింది. కేంద్ర స్థాయిలో క్రమం తప్పకుండా నియామకాలు చేపట్టే ప్రధాన సంస్థల్లో యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ప్రధానమైనవి. వీటిద్వారా గత ఐదేళ్లలో నాలుగున్నర లక్షలమందిని తీసుకున్నట్టు కేంద్రం చెబుతున్నది.

ఇవిగాక ప్రస్తుతం వివిధ విభాగాల్లో పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడివున్నాయి. కొలువుల భర్తీపై కేంద్రం తాజా ప్రకటనను విపక్షాలు తప్పుబడుతున్నాయి. రానున్న ఎన్నికల కోసమే ఈ ఆర్భాటమంటున్నాయి. కావొచ్చు... ఉద్దేశాలు ఏమైనప్పటికీ యువతకు ఉద్యోగ కల్పన నిర్ణయాన్ని హర్షించాల్సిందే. 

మరిన్ని వార్తలు