కొత్తగా నిర్మిస్తారా.. పునర్నిర్మిస్తారా?: 4 వారాల్లో చెప్పండి

25 Feb, 2021 16:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా ఉన్న చారిత్రక ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రిని పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా అనే విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నాలుగు వారాల్లో ఒక వైఖరి వెల్లడించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అయితే వారసత్వ కట్టడాలు కూల్చవద్దనే వాదనను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి గుర్తుచేసింది.

ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మించాలన్న పిల్స్‌పై గురువారం హైకోర్టు విచారణ చేసింది. చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దన్న పిల్స్‌ను పరిశీలించి ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన వ్యాజ్యాలన్ని కలిపి విచారణ చేపడుతోంది. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి స్థలం ప్లానుతో పాటు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.

మరిన్ని వార్తలు