ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్బాబు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. మొత్తం 8 మంది అభ్యర్థులు 15 నామినేషన్లు దాఖలు చేయగా నామినేషన్ల పరిశీలన అనంతరం ఏడుగురు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ (వైఎస్సార్సీపీ), వంకా రాజకుమారి, వీరవల్లి చంద్రశేఖర్, దేవరపల్లి ఆదాం, గోరింక దాసు, పసల వెంకటాచలం (స్వతంత్ర) అభ్యర్థుల నామినేషన్లను పరిగణనలోకి తీసుకున్నట్టు అరుణ్బాబు తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నల్లి రాజేష్ నామినేషన్ మూడు సెట్లూ నిబంధనల మేరకు లేకపోవడంతో తిరస్కరించామన్నారు.
1 నుంచి సొసైటీల్లో తనిఖీలు
ఏలూరు(మెట్రో): జిల్లాలోని కో–ఆపరేటివ్ సొసైటీల్లో అమలవుతున్న పనులకు సంబంధించి జిల్లాలోని సీనియర్ అధికారులతో వచ్చేనెల 1 నుంచి 31 వరకు రికార్డులు తనిఖీ చేయిస్తామని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని సొసైటీ సీఈఓలు, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్లు, వ్యవసాయ పరపతి సంఘాల కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సొసైటీల బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. కొన్ని సొసైటీల్లో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై విచా రణ చేపట్టి నివేదికను సమర్పించాలని ఆదేశించా రు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా సహకార అధికారి టి.ప్రవీణ, డీసీసీబీ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ శ్రీదేవి పాల్గొన్నారు.