తణుకు: దేశంలో శాంతి నెలకొల్పాలని కోరుతూ శాంతి దైవదర్శన్ పేరుతో కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణానికి చెందిన చాట్రాజుల విజయగోపాలకృష్ణ కాశీ నుంచి రామేశ్వరం వరకు గతేడాది మార్చి 11న చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం తణుకు చేరింది. ఇప్పటి వరకు ఘనాపూర్, తుల్జాపూర్, షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వరం, గుజరాత్లోని నర్మదనది, నాందేడ్, బాసర, త్రివేణి, కాశీ, అయోద్య, ఆగ్రా, లక్నో, హరియానా, పంజాబ్, సింధునదీ ప్రాంతాలు, తమిళనాడులోని కంచి, మధుర, కన్యాకుమారి, కేరళలోని తిరువనంతపురం, గురునాయర్, తలసేరు, కర్నాటకలోని మైసూర్, బెంగళూరు, ధర్మస్థలం, ఉడిపి, గోకర్న ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రముఖ ఆలయాలు, నదులను ఆయన సందర్శించారు. మన రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ దర్శనం చేసుకుని తణుకు మీదుగా రాజమహేంద్రవరం బయల్దేరారు. ఉదయం పర్యటన మొదలుపెడుతూ మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటూ రాత్రి సమయాల్లో ఆలయాల్లో సేదతీరుతూ ఇప్పటి వరకు సుమారు 28 వేల కిలోమీటర్లు తన సైకిల్ యాత్ర పూర్తి చేశానని, 13 రాష్ట్రాల్లోని 12 నదులను సందర్శించానని విజయ్గోపాలకృష్ణ తెలిపారు.