రూ.7 కోట్లు గెల్చుకునే అవకాశం చేజారింది!

18 Nov, 2020 16:17 IST|Sakshi

ఆసక్తికరంగా కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌-12

కోటి రూపాయలతో సరిపెట్టుకున్న మహిళా ఐపీఎస్‌

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్‌లో భాగంగా మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఐపీఎస్‌ అధికారి మహితా శర్మ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. షోలో అమితాబ్‌ అడిగిన 14 ప్రశ్నలకు ఏకధాటిగా సమాధానాలు ఇచ్చిన ఆమె రూ.7 కోట్లు గెల్చుకునే అవకాశం ఉన్న 15వ ప్రశ్న వద్ద క్విట్‌ అయ్యారు. దీంతో ఆమె కోటి రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మహితా శర్మను ఇంతగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఏంటా అనుకుంటున్నారా... అయితే తెలుసుకోండి మరీ.. 1817లో ముంబైలో వాదియా గ్రూపు నిర్మించిన బ్రిటీష్‌ యుద్ధనౌక పేరేంటి అనేదే ఆ ప్రశ్న. దీనికి సమధానం చెప్పాల్సిందిగా ఆమెకు నాలుగు ఆప్సన్స్‌ ఇచ్చారు. అందులో 1. హెచ్‌ఎమ్‌ఎస్‌ మిండెన్‌ 2. హెచ్‌ఎమ్‌ఎస్‌ కోర్న్‌వాలీస్‌ 3. హెచ్‌ఎమ్‌ఎస్‌ త్రింకోమలీ 4. హెచ్‌ఎమ్‌ఎస్‌ మియానీ.. అయితే మహితా శర్మ దీనికి సమాధానం చెప్పలేక పోటి నుంచి తప్పుకుంటునట్లు చెప్పారు. దీనికి ‘హెచ్‌ఎమ్‌ఎస్‌ త్రింకోమలీ’ అనేది సరైన సమాధానం అని, ప్రస్తుతం ఈ యుద్ధ నౌక రాయల్‌ నేవీ జాతీయ మ్యూజియంలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుందని అమితాబ్‌ వెల్లడించారు.

మహితా శర్మ కన్నా ముందు ఈ సీజన్‌ మొదటి కంటెస్టెంట్‌గా నజీయా నసీమ్‌ పాల్గొన్నారు. ఆమె కూడా కోటి రూపాయలు గెల్చుకుని రూ.7 కోట్ల ప్రశ్న వద్ద క్విట్‌ అయ్యారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోష్‌ ‘ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వం’ గురించి సింగపూర్‌లోని ఏ ప్రదేశంలో ప్రకటన చేశారనేది నజియాను అమితాబ్‌ అడిగిన రూ.7 కోట్ల ప్రశ్న. కేథలీ సినిమా హాల్‌, ఫోర్ట్‌ కానింగ్‌ పార్క్‌​, సింగపూర్‌ జాతీయ యూనివర్సిటీ, సింగపూర్‌ జాతీయ గ్యాలరీ అనేవి ఆప్షన్లు. దీనికి సరైన సమాధానం.. కేథలీ సినిమాహాల్‌. 

క్విట్‌ కావడంపై నజియా మాట్లాడుతూ.. రూ.7 కోట్ల ప్రశ్న వద్ద క్విట్‌ అయినందుకు తాను బాధ పడట్లేదన్నారు. ఇప్పుడు గెల్చుకున్న కోటి రూపాయలు రాకపోయినా తనకు ఏ మాత్రం నిరాశ ఉండదన్నారు. వేదిక పైకి వెళ్లి తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నజియా పేర్కొన్నారు. నిజానికి తాను డబ్బు కోసం షోలో పాల్గొనలేదని, నన్ను అ‍క్కడ చూడాలన్న తన తల్లి కోరిక​ నెరవేర్చడం కోసమే వెళ్లానన్నారు. తన తల్లి  కోరిక తీర్చినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని నజియా తెలిపారు. (చదవండి: కేబీసీలో ప్రశ్న.. అమితాబ్‌పై కేసు)

మరిన్ని వార్తలు