స్వీట్‌ ఎక్స్‌పెరిమెంట్‌: పరిశోధనత్రయం

17 Dec, 2022 00:29 IST|Sakshi

ముగ్గురమ్మాయిలు... యువ శాస్త్రవేత్తలు.

ఔషధాల ఆనుపానులు ఔపోశన పడుతున్నారు.

పరిశోధనలతో సమాజాన్ని ఆరోగ్యవంతం చేస్తున్నారు.

3డీ బయో ప్రింటెడ్‌ హ్యూమన్‌ మోడల్స్‌ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్‌ రీసెర్చ్‌’ అవార్డు వచ్చింది. సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఉదయ్‌ సక్సేనా, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్‌. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్‌ 2 డయాబెటిస్‌ డ్రగ్‌ను టెస్ట్‌ చేసే త్రీడీ బయో ప్రింటెడ్‌ హ్యూమన్‌ లైక్‌ టైప్‌ 2 డయాబెటిస్‌ మోడల్‌ని డెవలప్‌ చేశారు. అలానే టైప్‌ 2 డయాబెటిస్‌ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి.

దాదాపుగా ప్రతి సృష్టి
మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్‌ సైంటిస్ట్‌లు. కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్‌లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్‌ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్‌ హ్యూమన్‌ లైక్‌ మోడల్‌ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్‌ 2 డయాబెటిస్‌ డ్రగ్‌ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్‌ టైప్‌ 2 డయాబెటిస్‌ మోడల్‌ని డెవలప్‌ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్‌ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్‌ అసోసియేట్‌లుగా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లోని స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌లో ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌లోని రీజెనె ఇన్నోవేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు.

‘‘హెల్త్‌ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్‌ పాండమిక్‌ సమయంలో హ్యూమన్‌లైక్‌ మోడల్‌ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్‌ హ్యూమన్‌ వాస్క్యులార్‌ లంగ్‌ మోడల్‌ తర్వాత టైప్‌ టూ డయాబెటిస్‌ మోడల్‌ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్‌ దశకు చేరకుండా నార్మల్‌ లైఫ్‌ లీడ్‌ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్‌ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్‌ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్‌ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు.

సంజన బత్తుల

‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్‌ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్‌ లైక్‌ డిసీజ్‌ మోడల్స్‌ని డెవలప్‌ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్‌ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్‌ టూ డయాబెటిస్‌ మోడల్‌లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్‌ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్‌ అనే న్యూట్రాస్యుటికల్‌ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్‌ సప్లిమెంట్‌ కండరాల్లో గ్లూకోజ్‌ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్‌ మార్కెట్‌లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్‌ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కాలేజ్‌లో సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులార్‌ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు.

అర్పిత రెడ్డి, ఆర్‌. ఎన్

టైప్‌ వన్‌ జన్యుకారణాలతో వస్తుంది. టైప్‌ టూ డయాబెటిస్‌ మన దగ్గర లైఫ్‌ స్టయిల్‌ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్‌ కండిషన్‌లో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు పెరుగుతాయి.  ఒక వ్యక్తి డయాబెటిస్‌ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్‌ కండిషన్‌లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్‌ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు.

శరణ్య
– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు