ఎత్తు మడులతో ఎంతో మేలు!

21 Oct, 2020 12:45 IST|Sakshi
ఎత్తు మడులపై పత్తి పంటను చూపిస్తున్న కేవీకే శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్‌

ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఏదోవిధంగా నష్టపోతూనే ఉన్నారు. ఓ యేడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. అధిక వర్షం కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో బురదగా మారి పత్తి పంటలో ఎదుగుదల లోపించి దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఎత్తు మడుల పద్ధతి (రైజ్డ్‌ బెడ్‌ సిస్టమ్‌) ద్వారా కేవీకే క్షేత్రంలో వర్షాధారంగా బీటీ పత్తి సాగు చేస్తున్నారు. వర్షాధారపు సాగులో ఆదిలాబాద్‌ ప్రాంతంలో సాధారణంగా ఎకరానికి 8–10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అయితే, ఎత్తుమడుల పద్ధతిలో ఎకరానికి 13–15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంటున్నారు.

15–20 సెం.మీ. ఎత్తున మడులు
సమతల భూమి మీద గొర్రుతో తోలి సాళ్లుగా పత్తి విత్తుకోవడం సాధారణ పద్ధతి. ఎత్తు మడుల పద్ధతిలో ట్రాక్టర్‌కు రెయిజ్‌డ్‌ బెడ్‌ మేకర్‌ అనే పరికరాన్ని జోడించడం ద్వారా మడులు తోలుకొని పత్తి విత్తుకోవాలి. ఈ మడి 15–20 సెం.మీ. ఎత్తున ఉంటుంది. మడి వెడల్పు (ఆ భూమి స్వభావాన్ని బట్టి, అక్కడి వర్షపాతాన్ని బట్టి) ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మడి పైనే పత్తి విత్తనాలు నాటుతారు. పత్తి మొక్కలున్న ఎత్తు మడికి అటు ఇటు కాలువలు ఉంటాయి. 

వర్షాలు కురిసినప్పుడు పంట చేలల్లో వర్షపు నీరు ఈ కాల్వల్లో మాత్రమే నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుంది. వర్షాలు ఈ ఏడాది మాదిరిగా బాగా ఎక్కువగా కురిస్తే.. పత్తి మొక్కలు ఎత్తు మడిలో ఉంటాయి కాబట్టి ఉరకెత్తే ఇబ్బంది ఉండదు. మొక్కల వద్ద నీరు నిల్వ లేకపోవడంతో అవి ఏపుగా పెరుగుతాయి. గాలి సరిగా ఆడుతుంది. ఎండ బాగా తగులుతుంది. తెగుళ్లు కూడా అంతగా ఆశించవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వర్షాలు అంతగా లేనప్పుడు కూడా ఎత్తు మడి ఉపయోగపడుతుంది. వర్షానికి కాలువల్లో ఇంకిన నీటి తేమ ఉపయోగపడుతుంది.

భారీ వర్షాల్లో కూడా పత్తి చేలు ఉరకెత్తకుండా ఉండే ఉపాయం ఏమైనా ఉందా? ఉందంటున్నారు ఆదిలాబాద్‌ కేవీకే శాస్త్రవేత్తలు. ఎత్తు మడుల (రెయిజ్డ్‌ బెడ్స్‌)పై పత్తిని విత్తుకుంటే అతివృష్టిని మాత్రమే కాదు, ఒకవేళ అనావృష్టి ఎదురైనా పంట సమర్థవంతంగా తట్టుకోగలుగుతుందని అంటున్నారు. పసుపు మాదిరిగా పత్తి, కంది, మిర్చి, వంగ తదితర కూరగాయలను సైతం ఎత్తు మడలపై సాగు చేస్తే.. వర్షాలు అటూ ఇటూ అయినా సరే  10–20% మేరకు దిగుబడి పెరుగుతుందంటున్నారు.  

రెండేళ్లుగా ప్రయోగాలు 
కేవీకే సమన్వయకర్త డా. ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో రైజ్డ్‌ బెడ్‌ సాగు పద్ధతికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. గతేడాది కేవీకేలో ఈ పద్ధతిలో ఎకరంలో పత్తి సాగు చేస్తే 12.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 5 ఎకరాల్లో వేశారు. మొక్కల సాళ్ల మధ్య 180“30 సెం.మీ., 150“20 సెం.మీ., 120“30 సెం.మీ.ల దూరంలో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తి పంట ఐదున్నర అడుగుల ఎత్తు వరకు ఏపుగా పెరిగింది. ఒక్కో మొక్కకు ప్రస్తుతం 50 కాయలున్నాయి. మరో 30 నుంచి 40 కాయలు కాచే విధంగా పూత ఉంది. పురుగులు, తెగుళ్లు లేవు. సాళ్ల మధ్య తగినంత ఖాళీ ఉండటంతో కలుపు నిర్మూలనకు మినీట్రాక్టర్‌తో పైపాటు చేస్తున్నారు. కాయలు కాసిన తర్వాత పొలంలో నీరు నిల్వ ఉంటే కాయలు మురిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ తగినంత వర్షం కురవకపోయినా, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు ఎడం వచ్చినా పంట బెట్టకు వచ్చి దిగుబడి తగ్గుతుంది. ఎత్తు మడుల పద్ధతి ద్వారా పంటలను సాగు చేయటం ఒక్కటే ఈ సమస్యలకు పరిష్కారం అని కేవీకే సమన్వయకర్త డా. ప్రవీణ్‌కుమార్‌ రైతులకు సూచిస్తున్నారు. – సుధాకర్‌ యేరా, సాక్షి, ఆదిలాబాద్‌ టౌన్‌


వర్షాలు అటూ ఇటూ అయినా అధిక దిగుబడి!
వర్షాధార భూముల్లో ఎత్తు మడులపై పంటలను సాగు చేయటం ద్వారా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవచ్చు. వర్షాలు ఎక్కువైతే మడుల పక్కన కాలువల్లోంచి నీరు బయటకు వెళ్లిపోతుంది. పంట ఉరకెత్తదు. వర్షాలు తక్కువగా కురిసినా.. ఎక్కడి నీరు అక్కడే ఇంకుతుంది కాబట్టి భూమిలో తేమ ఉండి పంట దిగుబడి దెబ్బతినదు. అంటే.. వర్షాలు అటూ ఇటూ అయినా ఎత్తుమడుల వల్ల దిగుబడి దెబ్బతినదు. 10–20% అదనంగా దిగుబడి పొందవచ్చు. 

పసుపు మాదరిగా పత్తిని కూగా ఎత్తు మడుల్లో సాగు చేయవచ్చు. కంది, మిరప, వంగ వంటి కూరగాయలు కూడా ఇలా సాగు చేయవచ్చు. ట్రాక్టర్‌తో ఎత్తుమడులు తోలుకోవాలి. ఎర్ర నేలల్లో అయినా, నల్ల నేలల్లో అయినా సాగు చేయొచ్చు. తేలికపాటి, ఎర్ర నేలల్లో సాళ్ల మధ్య, మొక్కల మధ్య దూరం తక్కువగా పెట్టుకోవాలి. బలమైన నల్ల నేలల్లో అయితే కొంచెం ఎడంగా పెట్టుకోవాలి. ఎర్ర నేలల్లో మొక్కల సాంద్రత ఎక్కువగా, నల్లనేలల్లో తక్కువగా ఉంటుంది. 

మొదటి సారి గత ఏడాది నల్ల నేలలో 120“30 సెం.మీ. (సాళ్ల మధ్య 120 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ.) దూరంలో సాగు చేశాం. బాగా వత్తుగా అయ్యి పురుగుమందుల పిరికారీ ఇబ్బంది అయ్యింది. ఈ ఏడాది 150“30, 180“30 కొలతల్లో పత్తి విత్తాం. 180“30లో ఎకరానికి 7,400 మొక్కలు వచ్చాయి. మొక్కలు ఆరు అడుగులు ఎత్తు పెరిగాయి. సాళ్లు కూడా మూసుకుపోయాయి. ఈ ఏడాది ఎడతెరపి లేని వర్షాల్లో కూడా నీరు నిలవలేదు. పంట ఉరకెత్తలేదు. చీడపీడల్లేవు. చెట్టుకు 40–50 కాయలున్నాయి. ప్రస్తుతం ఉన్న పూతతో మరో 30 వరకు కాయలు వరకు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి ఖాయంగా వస్తుంది. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి, కలుపు గొర్రుతో తీస్తారా, ట్రాక్టర్‌తో తీస్తారా అన్నదాన్ని బట్టి రైతులు సాళ్ల మధ్య దూరాన్ని ఎంపిక చేసుకోవాలి. 
– డా. యాదగిరి ప్రవీణ్‌కుమార్‌ (99896 23829), సమన్వయకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్‌

24, 25 తేదీల్లో  ఆన్‌లైన్‌ దేశీ విత్తనోత్సవం
జాతీయ స్థాయిలో దేశీ విత్తనోత్సవాన్ని వినూత్నంగా తొట్టతొలిగా ఆన్‌లైన్‌లో ఈ నెల 24(శని)–25(ఆది) తేదీల్లో ఉ. 10 గం. నుంచి సా. 2.30 గం. వరకు జరగనుంది. భారత్‌ బీజ్‌ స్వరాజ్‌ మంచ్, ఆషా–కిసాన్‌ స్వరాజ్, సేవ్‌ అవర్‌ రైస్‌ క్యాంపెయిన్, సహజ సమృద్ధ సంస్థలు ఈ సంప్రదాయ విత్తన పరిరక్షణ కార్యక్రమాన్ని సంయుక్తంగా చేపట్టాయి. విలక్షణమైన సంప్రదాయ వంగడాలకు ఆలవాలం దేశం మనది. ప్రపంచంలో ఇంతటి సుసంపన్నమైన వ్యవసాయ జీవవైవిధ్యం కలిగిన అతి కొద్ది దేశాలలో భారత్‌ కూడా ఉంది. అమూల్యమైన ఈ వంగడాలను ఏటేటా సాగు చేస్తూ పరిరక్షించుకోవటం ఆహార భద్రత రీత్యా చాలా ముఖ్యమైన సంగతి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయ విత్తన పరిరక్షకులు వారి వద్ద ఉన్న వంగడాలను ఈ ఆన్‌లైన్‌ విత్తనోత్సవంలో ప్రదర్శిస్తారు. ఈ ఆన్‌లైన్‌ విత్తనోత్సవం చూడాలనుకునే వారు రెండు రోజులకు వేర్వేరుగా ఇప్పుడే రిజిస్టర్‌ చేసుకోవాలి. 

మొదటి రోజు 24వ తేదీ నాటి విత్తనోత్సవంలో పాల్గొనదలచిన వారు ఈ క్రింది వెబ్‌ పేజీలో రిజిస్టర్‌ చేసుకోవాలి. https://tinyurl.com/SeedMelaDay1
రెండో రోజు 25వ తేదీ నాటి విత్తనోత్సవంలో పాల్గొనదలచిన వారు ఈ క్రింది వెబ్‌ పేజీలో రిజిస్టర్‌ చేసుకోవాలి.  https://tinyurl.com/SeedMelaDay2

మట్టికి దగ్గరైతే మది తేలిక! 
కోవిడ్‌–19 కష్టకాలంలో స్వయంగా మట్టిలో విత్తనాలు వేసి సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయటం ప్రారంభించిన వారి మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడిందని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఇంటిపట్టున కూరగాయలు సాగు చేసుకునే వారికి శారీరక వ్యాయామం, ఆరోగ్యదాయకమైన కూరగాయలకు తోడు మానసిక స్వస్థత కూడా అభిస్తోందని ప్రిన్సెటన్‌ విశ్వవిద్యాలయం కరోనా కాలంలో చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ‘ప్రకృతిలో, మొక్కల మధ్య గడుపుతూ పెంచిన కూరగాయలను ఇరుగు పొరుగు వారితో పంచుకుంటూ ఉన్నప్పుడు వారి మదిలో స్థిమితత్వ భావన, గొప్ప సంతృప్తి, ఆనందం కలుగుతాయ’ని రొడేల్‌ ఇన్‌స్టిట్యూట్‌ కమ్యూనికేషన్స్‌ సంచాలకులు డయానా మార్టిన్‌ అన్నారు. కరోనా కాలంలో చాలా మంది ఉచిత కిచెన్‌ గార్డెన్‌ కిట్‌ తమ దగ్గర తీసుకొని కూరగాయల సాగు మొదలుపెట్టారన్నారు. 

మరిన్ని వార్తలు