అప్పట్లో అంతరిక్ష ప్రయాణమంటే కల్లోనే సాధ్యం, కానీ పెరిగిన టెక్నాలజీతో బాగా డబ్బున్న ఆసాములు ప్రైవేట్గా అంతరిక్షంలోకి ట్రిప్ వేసే వీలు కలిగింది. ఇప్పటివరకు ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్న అంతరిక్ష ప్రయాణం ప్రైవేట్ కంపెనీల ప్రవేశంతో రూపుమారుతోంది. దీంతో ఇకపై అంతరిక్షంలో వాణిజ్య ప్రకటనల పోటీ పెరగనుంది. ప్రస్తుతం భూమిపై కాదేదీ ప్రకటనలకనర్హం అనే రీతిలో వాణిజ్య ప్రకటనల జోరు కొనసాగుతోంది. ఏ కాస్త ఖాళీ స్థలం కనిపించినా, దానిపై తక్షణమే ఏదో ఒక కమర్షియల్ ప్రకటన ప్రత్యక్షమవుతోంది. వ్యాపారాల్లో పోటీ పెరిగే కొద్దీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు అడ్వర్టైజింగ్పై భారీగా వెచ్చిస్తున్నాయి.
ఈ జోరు క్రమంగా భూగోళం దాటి అంతరిక్షం వైపు పయనిస్తోందట. రెండేళ్ల క్రితం స్పేస్ రంగంలో యాడ్స్ రెవెన్యూ 36,600 కోట్ల డాలర్లు దాటిందంటే, వీటి జోరు ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు. అయినా స్పేస్లో ప్రకటనలేంటండీ, ఎవరు చూస్తారని ప్రశ్నిస్తే పైన చెప్పిందే సమాధానం. ఈ యాడ్స్ అన్నీ భారీగా డబ్బులున్న కుబేరులను ఉద్దేశించినవి. అంటే అంతరిక్ష యాత్రలకు వెళ్లే అతి ధనవంతులకోసమే ఈ ప్రకటనలు. స్పేస్యాత్రల జోరు మరింత పెరిగితే, ఈ ప్రకటనలు మరింతగా పెరుగుతాయి. మనలో మన మాట.. ‘‘మా సబ్బు వాడితే మిలమిల మెరుస్తారు’’ లాంటి ప్రకటనలు పొరపాటున ఏలియన్స్ చూస్తే ఏమనుకుంటారో కదా!
చదవండి: పాతికవేలతో హరిద్వార్కు స్పెషల్ టూర్!