Seethamma Jada Flowers: కిలో 100 నుంచి 200.. అప్పుడు ఎకరాకు 80 వేల నుంచి లక్ష దాకా ఆదాయం

29 Sep, 2022 16:25 IST|Sakshi

బతుకమ్మకు ‘సీతమ్మ’ అందాలు

రైతన్నకు దిగుబడుల సిరులు

మంచిర్యాల జిల్లాలో పెరిగిన సీతమ్మ జెడల పూలసాగు

పండుగకు 20 రోజుల ముందే అడ్వాన్స్‌

ఇతర పంటలు తగ్గించి పూలసాగు

ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి

Bathukamma- Seethamma Jada Flowers- మంచిర్యాల అగ్రికల్చర్‌: జిల్లాలో సీతమ్మ జెడల పూల సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. బతుకమ్మ పండుగ సీజన్‌లో దిగుబడితో లాభం చేకూరుతోంది. పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటల సాగు తగ్గిస్తూ పూలసాగుపై దృష్టి సారించడంతో విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది.

బతుకమ్మ తయారీలో విని యోగించే తంగేడు పూలతోపాటు సీతమ్మ జెడ పూలకు మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బతుకమ్మ పేర్చడానికి ఆకర్షణీయంగా ఉంటుందని విని యోగిస్తారు. చూడడానికి గుబురుగా, దట్టంగా, ఆకట్టుకునే గులాబీ, నారింజ రంగుల్లో కనువిందు చేస్తాయి. సీజన్‌లో ధర ఎక్కువగా ఉన్నా బతుకమ్మను పేర్చడానికి వెనుకడుగు వేయరు.

సద్దుల బతుకమ్మ ముందు నుంచి సీతమ్మ పూలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. కిలోపూలకు రూ.100 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇవ్వడంతో మహిళలు అధిక సంఖ్యలో పేరుస్తున్నారు. దీంతో పూలకు డిమాండ్‌ ఏర్పడింది. 

పెరిగిన సాగు
జిల్లాలో సీతమ్మ(సీతమ్మ జెడ) సాగు గతేడాది 60 ఎకరాల వరకు ఉండగా.. ఈ ఏడాది 120 ఎకరాల వరకు పెరిగింది. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వె ళ్లే దారి పక్కనే ఉన్న గ్రామాల్లో సీతమ్మ పూల సాగు కనిపిస్తోంది. లక్సెట్టిపేట, హాజీపూర్, కన్నెపల్లి, బె ల్లంపల్లి, భీమిని, జైపూర్, చెన్నూర్‌ మండలాల్లో సా గు చేస్తున్నారు. తులం విత్తనం రూ.500కు కొనుగోలు చేసి విత్తుకున్నారు.

రెండుమార్లు ఎరువులతోపా టు చీడపీడలు వ్యాప్తి చెందకుండా క్రిమిసంహారక మందులు పిచికారీచేశారు. జూలైలో విత్తుకున్న పంట పూతకు వచ్చింది. రెండు నుంచి మూడు తడుల నీటితో 70 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెడుతుండగా.. 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు.

గత ఏడాది ఎకరం సాగు చేసిన రైతులు రూ.80 వేల నుంచి రూ. లక్ష రూపాయల వరకు ఆదాయం పొందారు. కొన్ని చోట్ల రైతులు పత్తిలో అంతరపంటగానూ సీతమ్మ జెడ పూల సాగు చేస్తున్నారు.

చేను వద్దే విక్రయాలు..
కొందరు వ్యాపారులు ముందస్తుగానే సద్దుల బతుకమ్మ పండగ కోసం 20రోజుల ముందు నుంచే చేను వద్దకు వెళ్లి అడ్వాన్స్‌ ఇస్తున్నారు. గుత్త లెక్కన ఒ ప్పందం చేసుకుని డబ్బులు చెల్లిస్తున్నారు. ఒక్కో సా లుకు దూరాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.3,000 వేల వరకు రైతులు విక్రయిస్తున్నారు. 

పూలతోనే అందం
బతకమ్మ పేర్చడానికి తంగెడుపూలు ఎంతో ప్రత్యేకం కాగా.. అలంకరణతో సీతమ్మజెడల పూలుకూడా ఎంతో అందాన్ని ఇస్తుంది. ఇతర పూలు ఎన్ని ఉన్నా సీతమ్మ పూలు ఆకర్శణీయంగా ఉంటాయి.పండుగ సమయంలో ధర ఎక్కువైనా సీతమ్మ పూలు తప్పనిసరి కొనుగోలు చేసి బతకమ్మను పేర్చుకుంటాం. – బీమరాజుల సరిత, మంచిర్యాల  

చదవండి: Sagubadi: కాసుల పంట డ్రాగన్‌! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!
బతుకమ్మ ప్రత్యేకం.. బంతి, చామంతి, గునుగు, లిల్లీ, పట్టుకుచ్చులకు భలే గిరాకీ...

మరిన్ని వార్తలు