నల్ల తామరతో జాగ్రత్త!

21 Jun, 2022 06:21 IST|Sakshi
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిర్చిని సాగుచేస్తున్న గుంటూరు జిల్లా మహిళా రైతు కోటేశ్వరమ్మ

మిరప పంటను నల్ల తామర పురుగులు గత ఏడాది తీవ్రంగా నష్టపరిచాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడిన రైతులు ఎక్కువగా పంట నష్టాన్ని చవిచూశారు. రసాయన రహిత పద్ధతుల్లో సేద్యం చేసిన రైతులు తక్కువ ఖర్చుతోనే పంటను చాలా వరకు రక్షించుకోగలిగారు.

బ్లాక్‌ త్రిప్స్‌ లేదా నల్ల తామర (త్రిప్స్‌ పర్విస్పినస్‌).. కొత్త రకం పురుగు ఇది. గత ఏడాది మిరప తోటల్లో విధ్వంసం సృష్టించి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. తెలుగు రాష్ట్రాలు సహా ఆరు రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో వందలాది గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) నిపుణులతో కూడిన కమిటీ లెక్క తేల్చింది.

బ్లాక్‌ త్రిప్స్‌ 2015లో తొలిసారి బెంగళూరు పరిసరాల్లో బొప్పాయి తోటల్లో మొదటిసారి ఈ కొత్త రకం తామరపురుగు ను శాస్త్రవేత్తలు గుర్తించారు. 2018–19లో కర్ణాటకలో అనేక జాతుల అలంకరణ మొక్కలకు సోకింది. 2021లో మిర్చి పంటను తొలి సారి ఆశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, చత్తిస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో పంటలకు నష్టం కలిగించింది. మిరపకు అత్యధికంగా దిగుబడి నష్టం కలిగించింది. మిరపతో ఆగలేదు. 2021 అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్యకాలంలో కేంద్ర శాస్త్రవేత్తల బృందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పర్యటించినప్పుడు మిరపతోపాటు వంగ, మినుము, కంది, పుచ్చ, కీర దోస, సొర, మామిడి, పత్తి పంటల్లోనూ బ్లాక్‌ త్రిప్స్‌ కనిపించింది.

ప్రపంచ మిరప సాగు విస్తీర్ణంలో 40% మన దేశంలోనే ఉంది. అత్యధిక మిరప ఉత్పత్తిదారు, ఎగుమతిదారు కూడా మన దేశమే. హెక్టారుకు రూ.2.5 లక్షల నుంచి 4 లక్షల మేరకు రైతులు పెట్టుబడి పెట్టే వాణిజ్య పంట కావటంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం సందర్భంగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో మిరప పంటను సాగు చేసుకునే పద్ధతిని ఏపీ రైతు సాధికార సంస్థ నిపుణులు కంచర్ల రామచంద్రం రైతులకు ఈ కింది విధంగా సూచించారు.
తామర పురుగులు 1–2 ఎం.ఎం. పొడవుంటాయి. మిరప పైరును ఆశించి ఆకులు, పూత నుంచి రసం పీల్చటం వలన ఆకులు పైకి ముడుచుకుంటాయి. మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత రాలిపోతుంది. కాయలు గిడసబారి పొట్టిగా ఉంటాయి. దిగుబడులు పూర్తిగా తగ్గుతాయి. తామర పురుగుల బెడద తగ్గాలంటే మిరప రైతులు ఈ పద్ధతులను పాటించాలి.

1.    ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడొద్దు. ఘన, ద్రవ జీవామృతాలను మాత్రమే వాడాలి. ఘన జీవామృతం ఎకరాకు 1500 కిలోలు దుక్కిలో వేసి బోదెలు తోలాలి. మిరప మొక్కలు నాటే రోజు 500 కిలోల ఘన జీవామృతాన్ని మొక్కల మొదళ్ల దగ్గర వేస్తూ నాటాలి. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతంను నీటి తడులతో పారించాలి. స్ప్రే కూడా చేయాలి.
2.    మిరప పంటను ఏకపంటగా సాగు చేయకూడదు. అంతర పంటలుగా.. ఉల్లి, కొత్తిమీర, ముల్లంగి వంటి పంటలను.. ప్రతి రెండు మిరప మొక్కలకు మధ్య నాటాలి.
3.    మిరపలో ఎర పంట (ట్రాప్‌ క్రాప్‌)గా ఎకరానికి 200–300 బంతి మొక్కలు నాటాలి.
4.    ప్రతి ఎకరాకు 25–30 నీలి రంగు జిగురు అట్టలను పొలంలో అక్కడక్కడా పెట్టాలి.  
5.    మిరప పొలం చుట్టూ 3 లేదా 4 వరుసల్లో మొక్కజొన్న/జొన్నను రక్షక పంటగా విత్తాలి.
6.    మిరప మొక్కలు నాటిన 10వ రోజు నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి:

► మొదట 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ∙3 రోజుల తర్వాత గంజి ద్రావణం పిచికారీ చేయాలి. ∙7 రోజుల తర్వాత కోడిగుడ్లు+నిమ్మ రసం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ∙15 రోజులకు పేడ+మూత్రం+ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
► 22వ రోజు వంద లీటర్ల నీటిలో 10 లీ. ద్రవ జీవామృతంతోపాటు 250 గ్రా. వర్టిసిల్లియమ్‌ లెకాని స్ప్రేచేయాలి.
► 30వ రోజు దశపర్ణి కషాయం స్ప్రే చేయాలి.
► 37వ రోజు మట్టి ద్రావణం స్ప్రే చేయాలి.
► 45వ రోజు నల్లేరు కషాయం స్ప్రే చేయాలి. తదుపరి అవసరాన్ని బట్టి పై షెడ్యూల్‌ ప్రకారం తిరిగి అదే వరుసలో మరోసారి పిచికారీ చేయాలి. ఏపీ రైతు సాధికార సంస్థ నిపుణులు కంచర్ల రామచంద్రంను 90004 00515 నంబరులో సంప్రదించవచ్చు.

– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

మరిన్ని వార్తలు