మోనోపాజ్‌ తర్వాత రక్తస్రావం?! 

15 Jan, 2021 14:52 IST|Sakshi

మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం చాలా సహజం. అయితే రుతుక్రమం ఆగిపోయి, వాళ్లకు మెనోపాజ్‌ దశ వచ్చాక మాత్రం...కొద్దిగానైనా సరే రక్తస్రావం కనిపిస్తే అది ప్రమాద సంకేతం. రుతుస్రావం ఆగిపోయి... ఏడాది కాలం దాటాక రక్తస్రావం కనిపిస్తుందంటే... అది ఎందుకు జరుగుతోంది, దానికి కారణాలు ఏమిటో కనుగొని, తగిన చికిత్స చేయించుకోవాలి. మెనోపాజ్‌ తర్వాత కూడా రక్తస్రావం కనిపిస్తుందంటే దానికి కారణాలేమిటో, అదెంత ప్రమాదకరమో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు/ చికిత్స ఏమిటో అవగాహన కలిగించేందుకే ఈ కథనం. 

ఓ యువతికి యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అండాశయాల్లోని అండాలన్నీ నెలకు ఒకటి చొప్పున విడుదల అవుతూ ఉంటాయి. అవి పూర్తిగా సంసిద్ధంగా ఉన్న  సమయంలో కలయిక జరగనప్పుడు అవి క్రమంగా క్షీణించి, అండం ఉన్న ఎండోమెట్రియం పొరతో పాటు రాలిపోతాయి. ఇలా రాలిపోయినప్పుడే మహిళల్లో నెలసరి తాలూకు రక్తస్రావం కనిపిస్తుంది. దీన్నే రుతుస్రావం అంటుంటారు. మహిళలు తమ మధ్యవయసుకు చేరేనాటికి వారిలోని అండాలన్నీ పూర్తిగా అయిపోతాయి. దాంతో వారికి అండం విడుదల ఆగిపోవడంతో పాటు నెలసరి అయ్యే రుతుస్రావమూ ఆగిపోతుంది. దీన్నే ఇంగ్లిష్‌లో మెనోపాజ్‌ అని అంటారు. 

మెనోపాజ్‌ దశలో కొన్ని హార్మోన్ల ఉత్పత్తి కూడా మునుపటిలా ఉండదు. దాంతో పన్నెండు, పద్నాలుగేళ్ల వయసులో మొదలైన రుతుక్రమం నిలిచిపోతుందన్నమాట. అది జరిగాక కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే నలభైఏళ్లలోపు రుతుక్రమంలో కొద్దిపాటి మార్పులు  కనిపించినా అవి చాలావరకు క్యాన్సర్‌కు సంబంధించినవి కాకపోవడంతో... క్యాన్సర్‌ వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ.. ఏళ్లు గడిచేకొద్దీ క్యాన్సర్‌ ముప్పు (రిస్క్‌) పెరుగుతుంది. సాధారణంగా అయితే యాభై లేదా అరవై ఏళ్లు దాటాక రక్తస్రావం కనిపిస్తే అది ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ అయ్యేందుకు పది నుంచి పదిహేను శాతం వరకు ఆస్కారం ఉంది. అలాంటప్పుడు మందులివ్వడం, డీఅండ్‌సీ చేయడం లాంటి చిన్న చికిత్సలు సరిపోవు. మహిళకు అవసరమైన అన్ని పరీక్షలూ నిర్వహించి... అలా రక్తస్రావం జరగడానికి కచ్చితమైన కారణాన్ని తప్పక  తెలుసుకోవాల్సి ఉంటుంది.

చేయించుకోవాల్సిన పరీక్షలివి... 
మహిళల్లో మెనోపాజ్‌ తర్వాత కూడా రక్తస్రావం కనిపించిన పరిస్థితుల్లో అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్‌ స్కాన్‌ చేస్తారు. ఈ పరీక్షలో గర్భాశయ పనితీరూ, ఎండోమెట్రియం పొర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్‌ దశ దాటిన స్త్రీలలో ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు. కాబట్టి మరికొన్ని ఇతర పరీక్షలూ చేయించుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ వల్ల గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి వంటి వివరాలు తెలుస్తాయి. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరుగుతుండటం, కణుతుల్లాంటివి ఉంటే అది అసహజమని గుర్తించాలి. 

స్కాన్‌ మాత్రమే కాకుండా అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్‌ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఈ పరీక్ష కోసం ఎలాంటి మత్తూ, ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. చిన్న గొట్టం ద్వారా నమూనాను సేకరిస్తారు. అయితే ఈ పరీక్షకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నమూనా సేకరించే సమయంలో... సమస్య ఉన్న ముక్క మాత్రమే రాకుండా ఆరోగ్యవంతమైనదీ రావచ్చు. దాంతో రిపోర్టు తప్పుగా వచ్చే అవకాశాలూ లేకపోలేదు.

కొన్నేళ్ల కిందటివరకూ డీఅండ్‌ సీ (డైలటేషన్‌ అండ్‌ క్యూరటార్జీ) పద్ధతిలో నమూనాలను సేకరించేవారు. అంటే విడివిడిగా గర్భాశయం పైభాగం, కిందిభాగం, గర్భాశయ ముఖద్వారం నుంచి సేకరించేవారు. అప్పటికీ నూటికి నూరు పాళ్లు కచ్చితమైన ఫలితం వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. గర్భాశయ ముఖద్వారం నుంచి సన్నని టెలిస్కోప్‌ని లోపలికి పంపి, కెమెరా ద్వారా లోపలి దృశ్యాలను  మానిటర్‌పై చూస్తారు. అక్కడి పరిస్థితి అంతా భూతద్దంలో చూసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా సరైన చోటునుంచే నమూనా సేకరించవచ్చు.

గర్భాశయం లోపలి పొర మందం, పాలిప్, ఫైబ్రాయిడ్, క్యాన్సర్‌ కణితి లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా చిన్న చిన్న పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి గుర్తించడంతోపాటూ అదే సమయంలో చికిత్స కూడా చేయవచ్చు. అంటే సమస్యను గుర్తించడం, చికిత్స చేయడం... ఈ రెండూ ఏకకాలంలో పూర్తవుతాయన్నమాట.  సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్‌ ఇన్‌ఫ్యూజన్‌ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు. ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించకపోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్‌ లాంటివి చేయాల్సి రావచ్చు. ఈ ఫలితాలను బట్టి, చికిత్స లేదా ఆ తర్వాత ఏం చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు..

ఇతర కారణాలూ ఉంటాయి...
మెనోపాజ్‌ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు... పెద్దవయసులో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే చాలామందికి అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. అందుకే వైద్యులు ముందు జననేంద్రియభాగం చుట్టుపక్కల ఉండే ఇతర అవయవాలనూ క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, అక్కడి నుంచి రక్తస్రావం అయ్యేందుకూ అవకాశముంది. 

జననేంద్రియాల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్, ఉన్నా ఇలా రక్తస్రావం కనిపించవచ్చు. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్‌ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది.

మెనోపాజ్‌ దశ దాటాక హార్మోన్‌ చికిత్స  (హెచ్‌ఆర్‌టీ) తీసుకునేవారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ కోసం వాడే టామోక్సిఫిన్‌ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్‌ కనిపించవచ్చు.  మరికొందరిలో ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా క్యాన్సర్లు వస్తాయి. ఈ పరిస్థితిని ‘లించ్‌ సిండ్రోమ్‌’ అంటారు. కారణాలేమైనప్పటికీ మెనోపాజ్‌ తర్వాత రక్తస్రావం అయితే తప్పక గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి

కొన్ని సూచనలూ... చికిత్సలు
ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్‌ ఫలితం మామూలుగానే ఉన్నప్పుడూ రక్తస్రావం కనిపించినా భయపడాల్సిన అవసరంలేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఎండోమెట్రియం పొర ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ అని తేలితే మళ్లీ ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసి ఆ క్యాన్సర్‌ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్‌ గ్రంథులూ, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స / శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్‌ ఉన్నా దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్లణయిస్తారు.

ఒకవేళ క్యాన్సర్‌ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే... పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే... వాటిని తొలగిస్తారు. ఎండోమెట్రియం పొర మందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్‌ హార్మోను సూచిస్తారు. లేదంటే హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి ‘ఎట్రోఫిక్‌ ఎండోమెట్రియం’ పరిస్థితి వస్తుంది. అప్పుడు అందుకు తగినట్లుగా హార్మోన్లు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. 

ముందు జాగ్రత్తలు ముఖ్యమే..
అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం (డయాబెటిస్‌) ఉన్నవారు సాధారణ మహిళల కంటే ఈ సమస్య బారిన పడే అవకాశాలు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి.

పీసీఓడీ ఉన్న వారు తప్పనిసరిగా మందులు వాడాలి. పిల్లలు కలిగాక వైద్యుల సలహాతో గర్భనిరోధక మాత్రలు లేదా ప్రొజెస్టరాన్‌ లూప్‌ని వాడటం ద్వారా ఎండోమెట్రియం పొర ఎదుగుదలను అదుపులో ఉంచొచ్చు. హార్మోన్‌ చికిత్స (హెచ్‌ఆర్‌టీ) తీసుకునే వారు ఈస్ట్రోజెన్‌తో పాటూ తప్పనిసరిగా ప్రొజెస్టరాన్‌ని వాడాలి.

కుటుంబంలో లింఛ్‌ సిండ్రోమ్‌ (వంశపారంపర్యంగా క్యాన్సర్లు వచ్చే కండిషన్‌) ఉన్న స్త్రీలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర గురించి తెలుసుకోవాలి
 

మరిన్ని వార్తలు