కంప్యూటర్‌ టైపింగ్‌లో తప్పులెందుకొస్తాయో తెలుసా​?

1 Apr, 2021 22:22 IST|Sakshi

చాలామంది గంటలతరబడి అలాగే కంప్యూటర్‌ ముందు కూర్చుని టైపింగ్‌ వంటి పనిచేస్తుంటారు. అలా చేస్తున్న క్రమంలో ముందు కాసేపు బాగానే ఉండి... ఆ తర్వాత తప్పులు ఎక్కువగా దొర్లుతుంటాయి. దీనికో కారణం ఉంది. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోష్చర్‌లో కూర్చుంటే అది ‘స్టాటిక్‌ లోడింగ్‌’  అనే పరిస్థితికి దారితీస్తుంది. కొందరిలో కేవలం అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. ఈ కండిషన్‌లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు సైతం 30 శాతం మందగిస్తాయి. దాంతో ఆక్సిజన్‌ పాళ్లూ 30 శాతం తగ్గుతాయి. అంటే... ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పనిచేస్తున్నా కొద్దిసేపట్లోనే అలసిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

అలాగే వ్యాయామం తగ్గడం వల్ల కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దీర్ఘకాలంపాటు కంప్యూటర్‌పై పనిచేయాల్సిన వారు కొద్ది కొద్ది సేపటికోసారి లేచి కాసేపు తిరగాలి. అలాగే  కంప్యూటర్‌ స్క్రీన్‌ వైపు రెప్పవాల్చకుండా చూడకూడదు. ప్రతి పది నిమిషాలకు ఒకమారు కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ ఉండాలి. ఇలా కంప్యూటర్‌పై కూర్చుని పనిచేసేవారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ సూచనలను అనుసరిస్తే చాలావరకు తప్పుల సంఖ్య తగ్గుతుంది. 
చదవండి: ఏసీ వాడుతున్నారా? ఇవి మీకోసమే

మరిన్ని వార్తలు